CM Revanth Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలకు తెలియజేశారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధ, గురువారాల్లో వేర్వురుగా భేటీ అయ్యారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ తెలియజేశారు. అందుకు సంబంధించిన నివేదికలను సీఎం అగ్ర నేతలకు అందజేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు బుధవారం జరిగాయని.. శుక్రవారం ఫలితాలు వెలువడనున్నాయని వారికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
మున్సిపల్ ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని సీఎం రేవంత్ కాంగ్రెస్ పెద్దల దగ్గర ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి కార్యక్రమాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
ఉద్యోగ నియామకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటివి యువతలో ప్రభుత్వం పట్ల మంచి గుడ్ విల్ తీసుకొచ్చాయని సీఎం తెలిపారు. ఓవైపు అభివృద్ధి పనులు మరోవైపు సంక్షేమం.. చేసిన పనులను వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్ర నేతలకు తెలియజేశారు. క్షేత్ర స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు.
Also Read: Chandrababu – Bandla Ganesh: తన కోసం తిరుమలకు పాదయాత్ర.. బండ్ల గణేశ్తో చంద్రబాబు ఏమన్నారంటే?
దిల్లీ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటి అయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి చివరివారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటి అయ్యి.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి, కొత్తగా రైల్వే లైన్లు గురించి మంత్రికి వివరించారు. అటు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై.. మామూనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తైన సందర్భంగా పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.