Dhoolipet Drug Bust: హైదరాబాద్లోని ధూళిపేట్ ప్రాంతంలో అక్రమ గంజాయి విక్రయాలపై ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో గంగాబౌళిలోని ఓ ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2.03 కిలోల గంజాయితో పాటు రూ. 14వేల నగదు, ఒక టూ వీలర్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అర్జున్, నందిని, లడ్డు, గౌరంగ కంత్రి అనే నలుగురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. వీరితో పాటు రంజన్ కారా, నీతుబాయి, గోవింద్, గౌతమ్ సింగ్, దుర్గుష్సింగ్, రోషు అనే మరో ఆరుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరో నిఘా చర్యలో భాగంగా.. ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎస్సై బాలరాజు బృందం ధూళిపేట్ పురానాపూల్ ప్రాంతంలో దాడులు నిర్వహించింది. అక్కడ విక్రయానికి సిద్ధంగా ఉన్న 1.258 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులో మన్మోహన్సింగ్, మలాబాయిలను అరెస్టు చేయగా.. గాయత్రి, శిల్ప, రోహిత్లపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను, గంజాయిని తదుపరి చర్యల నిమిత్తం ధూళిపేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.
మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యంపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుండి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీ టీమ్ సి.ఐ. వెంకటేశ్వర్లు బృందం పహాడీ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 68 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వాటిని మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. డ్రగ్స్, అక్రమ మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
Also Read: వ్యాపారులకు హైడ్రా ‘డెడ్ లైన్’.. మార్చి నుంచి ముమ్మర తనిఖీలు!