Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. దివంగత నేత ఎన్టీఆర్ ఒక జాతీయ సంపదని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్కు ‘భారతరత్న’ ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానని, గతంలో పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల హామీ మేరకు త్వరలోనే నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
సింగరేణి సంస్థ అప్పుల ఊబిలో ఉందన్న విమర్శలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం 2018లోనే మార్పులు చేసిందని ఆయన గుర్తు చేశారు. సింగరేణిలో జరుగుతున్న టెండర్ల వ్యాపారం మరియు అక్రమాలపై తాను అసెంబ్లీ వేదికగా అన్ని ఆధారాలతో మాట్లాడతానని స్పష్టం చేశారు. సింగరేణి మేం అధికారంలోకి రాకముందు నుంచే అప్పుల్లో ఉందని, జెన్కోకి బొగ్గు సరఫరా చేసిన బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. కోల్ ఇండియా కూడా అప్పుల ఊబిలో ఉందని, తాను అమాయకుడిని కాబట్టి తన మీద నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ప్రూఫ్ చేస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?” అని ప్రశ్నించిన సీఎం, గతంలో కెసిఆర్ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కెసిఆర్ ప్రస్తుతం సెల్ఫ్ హౌస్ అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ను బుల్లెట్ ట్రైన్ హబ్గా మారుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 600 ఎకరాల భూమిని సేకరించి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరినట్లు తెలిపారు. 2034 నాటికి బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని, 2029లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. జమిలి ఎన్నికల వల్ల తన పదవీకాలం మరో ఆరు నెలలు పెరుగుతుందని, రాబోయే 10న్నర ఏళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణా-గోదావరి జలాల వివాదంపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ విభజన తర్వాత పూర్తి చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. అలాంటప్పుడు పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఎందుకు కేసులు వేసి అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను ఉమ్మడిగా వాడుకునేలా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని హితవు పలికారు. ఏపీ ప్రాజెక్టులకు సహకరిస్తున్న కేంద్రం, తెలంగాణ ప్రాజెక్టులకు కూడా సహకరించాలని కోరారు.
Read Also: CM Chandrababu Naidu: అసెంబ్లీలో ‘ఆవు కథలు’ చెప్పొద్దు.. సబ్జెక్టుతో రండి: సీఎం చంద్రబాబు