కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికి, మెరిట్ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వికారాబాద్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో సీఎం కీలక వ్యాఖ్యలుచేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని పేర్కొన్న ఆయన.. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు.
వారసత్వంగా రాజకీయ అవకాశాలు ఎవరికీ రావని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మనం పడే కష్టం, శ్రమ ఎప్పటికీ వృథా కావని గుర్తు చేశారు. శిక్షణను శిక్షగా భావించకుండా నేర్చుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైనంత మాత్రాన ఆ జిల్లాలపై ఆధిపత్యం తమదేనని భావిస్తే అది మొదటి తప్పిదం అవుతుందని హెచ్చరించారు. డీసీసీ పోస్టు అనేది కేవలం అధికారం కాదని.. అది ఒక కుటుంబ పెద్దలాంటి బాధ్యత అని రేవంత్ రెడ్డి వివరించారు.
పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం సహజమని ముఖ్యమంత్రి అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో మహాత్మాగాంధీ కాలం నుండి కొనసాగుతోందని.. దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. మనల్ని వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తే అది సంస్థకు కీడు చేసినట్లే అవుతుందని హెచ్చరించారు. అందరినీ కలుపుకొని పోవడమే నాయకత్వ లక్షణమని ఆయన ఉద్బోధించారు.
తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. పార్టీలో అంతర్గతంగా కూడా కొంత వ్యతిరేకత ఎదురైందని వెల్లడించారు. అయితే ఆ సమయంలో వెనకడుగు వేయకుండా నేతలందరి ఇళ్లకు స్వయంగా వెళ్లానని చెప్పారు. వయసులో.. అనుభవంలో.. చిన్నవాడినైనా పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని.. అందరూ సహకరించాలని కోరి ఒప్పించానని వివరించారు.
నేతలందరి సమిష్టి కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం 2.5 నుండి ఏకంగా 40 శాతానికి పెరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. డీసీసీ అధ్యక్షులుగా గతంలో బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టామన్నారు. పార్టీ కోసం కష్టపడిన మరో 60 మంది నాయకులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించామని ముఖ్యమంత్రి వివరించారు.