CM Revanth Reddy: రాజకీయ నాయకుల హామీలు ఎన్నికల వరకే పరిమితం కాదని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు నిరూపించారు. కామారెడ్డి జిల్లాలో ఓ మహిళకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. జిల్లాలోని బిక్కనూరు ప్రాంతానికి చెందిన లక్ష్మీకి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని భరోసా కల్పించారు. దీని ప్రకారమే ఆమెకు ఇంటిని కేటాయించారు. నేడు గృహ ప్రవేశం కూడా జరగనుంది.
2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామం మీదుగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర జరిగింది. ఆ సమయంలో తన ఇల్లు కూలిపోయిన విషయాన్ని లక్ష్మీ.. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొత్త ఇల్లు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాటకు అనుగుణంగా బిక్కనూరు లక్ష్మీకి ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. నేడు జరగబోయో లక్ష్మీ గృహప్రవేశానికి ఆయన స్వయంగా హాజరుకాబోతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపై లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తో పాటు ఇందుకు సహకరించిన షబ్బీర్ అలీ, గూడెం శ్రీనివాస్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు స్థానికులు సైతం సీఎం రేవంత్ నిజాయతీని మెచ్చుకుంటున్నారు. లక్ష్మీ ఇల్లు చాలా బాగుందని చెబుతున్నారు. తాము సొంతంగా కట్టుకున్న ఇంత బాగా ఉండేది కాదని పేర్కొంటున్నారు. లక్ష్మీతో పాటు మరో మహిళకు సైతం ఇందిరమ్మ ఇంటిని కేటాయించారని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పథకం కింద రూ.5 లక్షలు మంజూరు కాగా.. అదనంగా మరికొంత డబ్బును సైతం ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: Iran Earthquake: యుద్ధంలో మునిగిన ఇరాన్పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం
సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ పలుమార్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా రైతులకు బోనస్ ఇస్తానని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల తర్వాత సన్న వడ్ల కోసం రూ.500 కోట్లకు పైగా బోనస్ ను విడుదల చేశారు. ఆ డబ్బు నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యింది. సీఎం రేవంత్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారని.. తాజాగా బిక్కనూరు లక్ష్మీ విషయంలోనూ నిరూపితం అయ్యిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
Also Read: Iran-Israel War Report: ఎనిమిదో రోజుకు యుద్ధం.. వారంలో మాటల్లో చెప్పలేనంత విధ్వంసం!