CM Revanth Reddy: అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఆహ్వానం అందుకున్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్(Harvard Kennedy School) మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని రేవంత్ రెడ్డిని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం.
మార్చిలో జరిగే ఈ కార్యక్రమంలో హార్వర్డ్ కెన్నడీ స్కూల్ డీన్ జెరెమీ వైన్స్టీన్ తో కలిసి సింపోజియం ప్రారంభించాలని ప్రత్యేక ఆహ్వాన లేఖను అందించారు. వివిధ రంగాల ప్రముఖులతో పాటు సాంకేతిక నిపుణులు హాజరవుతారు. హైదరాబాద్(Hyderabad) నుంచే వర్చువల్గా ఈ వేదికపై ప్రసంగించే అవకాశాన్ని పరిశీలిస్తానని సీఎం అంగీకరించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కార్యక్రమాల చివరి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ప్రతినిధి బృందాలు, పలు స్కూల్ విద్యార్థులు, అలుమినీతో పాటు ఎంఐటీ, కొలంబియా యూనివర్సిటీల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు.
Also Read: Big Tv Kissik Talks: రీతూ క్యారెక్టర్ బ్యాడ్.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పవన్
నాయకత్వం, ఆర్థిక వృద్ధి, సుస్థిరాభివృద్ధి, పర్యావరణం,రైతులు–మహిళలు–యువత సంక్షేమం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధికారత అభివృద్ధి దిశగా ఉన్న అవకాశాలను వివరించారు. భవిష్యత్తు భారత పురోభివృద్ధిలో తెలంగాణ, అందులో ప్రధానంగా హైదరాబాద్ ముందుండి దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ దేశాల్లో చదువుతున్న విద్యార్థులు తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.