CM Revanth Reddy : దావోస్ పర్యాటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం.. తాజాగా అర్భన్ మొబిలిటీ అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ నగరాలతో అభివృద్ధిలో పోటీపడుతున్న హైదరాబాద్ ను రానున్న రోజుల్లో ఎలా తీర్చిదిద్దనుంది.. ఈ సమావేశం వేదికగా సీఎం వెల్లడించారు.
ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ భావిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ప్రయత్నాలకు అందరి సహకారం కావాలని పిలుపునిచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం పలికారు. తక్కువ ఖర్చుతోనే అత్యధిక వేగంగా ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్షగా తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతుందని ప్రకటించారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ లో మరో నగరాన్ని నిర్మిస్తున్నామని, అదే ఫ్యూచర్ సిటీ అంటూ ప్రకటించారు. పర్యావరణ హితంగా హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతం అని అన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్ లో ఉండాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. అందుకోసం విద్యుత్ వాహనాలను పోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే.. తెలంగాణ ప్రభుత్వం ఈవీ వాహనాల వినియోగానికి కల్పించాల్సిన ప్రోత్సాహాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా ఈవీలు అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులు సృష్టిస్తుందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదని, ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణ అనుకూలంగా రవాణా సౌకర్యాలు మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3 వేల ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెటనున్నట్లు ప్రకటించారు.
అలాగే.. రాష్ట్రం నుంచి ఎగుమతుల్ని భారీ ఎత్తున చేసేందుకు ముందు చూపుతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సముద్ర పోర్టు లేకపోవడంతో.. డ్రైపోర్టు నిర్మాణానికి సంకల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నగరం నుంచి..మచిలీపట్నం పోర్టుకు.. రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.
నగరాల అభివృద్ధికి, వాటి భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటీ భవిష్యత్తుకు పునాది అన్నారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో 1.2 కోట్లకు పైగా జనాభా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి.. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.
నగరంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న మెట్రో లైన్ కంటే.. రానున్న మెట్రో నిర్మాణం రెండింతలు ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే.. దావోస్ లో రైలు ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తాను, తన బృందం జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైలులో వెళ్లామని, అదో అందమైన అనుభూతి కలిగించిన ప్రయాణం అని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : హైదరాబాద్కి ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 10 వేల కోట్లతో
ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కి.మీ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నట్లు సమావేశంలో పాల్గన్న వారికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ రెండు రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు కూడా నిర్మించనున్నట్లు ప్రటకించారు. రింగ్ రోడ్లకు అనుబంధంగా రింగ్ రైల్వే లైను నిర్మించాలనే ఆలోచనలున్నట్లు తెలిపారు.