CM Revanth Reddy on another 2 Guarantees: ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద రేషన్కార్డు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలను సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల పథకాల ప్రారంభ వేదిక మార్చినట్లు చెప్పారు.
మాట ఇస్తే కాంగ్రెస్ వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు అధికారంలో అప్పగించారన్నారు. వాటిన్నంటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ప్రకటించామన్నారు. వాటిలో నాలుగు పూర్తి అయ్యాయని అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను ఎప్పుడూ విస్మరించలేదన్నారు. అందుకే ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తామన్నారు. అర్హత ఉండి ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండల కార్యాలయానికి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
కట్టల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి రూ.1,500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలోని బీజేపీ రూ.1,200కి పెంచిందన్నారు.
Read More: హైదరాబాద్లో 21వ బయో ఆసియా 2024 సదస్సు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని రూ. 500కే సిలిండర్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తమ ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. ఆరు గ్యారెంటీలు మలు చేసితీరుతామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు ఉన్నారు.