CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రూ.151.92 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలతో పాటు ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో చేపట్టనున్న ఈ పనులతో.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, విద్యుత్ సౌకర్యాల విస్తరణ వంటి పలు మౌలిక వసతి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీలోనే రూ.121.92 కోట్ల వ్యయంతో.. ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యామ్ దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో జూరాల ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరమవుతాయని, వరద కాలంలో కూడా రవాణా అంతరాయం ఉండదని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆత్మకూరు మున్సిపాలిటీలో.. 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు.
ఇదే కార్యక్రమంలో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో చేపట్టనున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. అమరచింత లోని రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పార్కులు, విద్యుత్ సదుపాయాల అభివృద్ధిపై ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల ద్వారా అభివృద్ధిని చూపించడానికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం. ఆత్మకూరు, అమరచింత ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనులు ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకువస్తాయి అని పేర్కొన్నారు.
Also Read: తక్కువ వడ్డీ రుణాలతో తెలంగాణ అభివృద్ధికి వేగం.. హడ్కో ఛైర్మన్తో సీఎం కీలక భేటీ
మొత్తంగా రూ.151.92 కోట్లతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు నాగర్కర్నూల్ జిల్లాలో మౌలిక వసతుల రూపును మార్చనున్నాయని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించనున్నాయని అధికారులు వెల్లడించారు.