Hyderabad: హైదరాబాద్-బెంగుళూరు నగరాలను డిఫెన్స్-ఏవియేషన్ కారిడార్ గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్రెడ్డి. ఏరోస్పేస్, ఏవియేషన్ విభాగాలకు హబ్గా హైదరాబాద్ మారుతోందన్నారు. ఏవియేషన్ కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయని గుర్తు చేశారు.
ఏవియేషన్ విభాగానికి హబ్గా హైదరాబాద్
శంషాబాద్ లోని GMR ఏరోపార్క్లో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభోత్సవంలో M88-MRO కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం రేవంత్రెడ్డి. శాఫ్రాన్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందన్నారు. ఏవియేషన్ రంగానికి చెందిన ఎంతో మంది నిపుణులు ఉన్నారని తెలిపారు. ఆ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.
సాఫ్రాన్ సంస్థ ఏఈఎస్ఎఫ్ ప్రారంభంలో సీఎం రేవంత్
వచ్చేనెల జరిగే గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9న జరిగే సమ్మిట్కు హాజరుకావాలని ఈ సందర్భంగా కోరారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. కేంద్రం నుంచి శాఫ్రాన్ సంస్థకు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్ 1500 ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్ ఇచ్చిందని, ఎయిర్ క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమన్నారు.
ALSO READ: దేశంలో అతి పెద్ద సిటీగా హైదరాబాద్, ఆపై మూడు కార్పొరేషన్లు?
పలు రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి పన్నుల భారాన్ని తగ్గించామన్నారు. కొత్తగా నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తూ, కార్మికులకు మేలు చేస్తున్నట్లు వివరించారు.
భవిష్యత్తులో ఎయిర్క్రాఫ్ట్ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్క్రాఫ్ట్ల తయారీ ఖర్చు తగ్గుతుందన్నారు. దీనివల్ల ఆ లాభం ప్రయాణికులకు బదిలీ అవుతుందన్నారు. ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కోసం సింగపూర్-మలేసియా వంటి దేశాలపై ఆధారపడుతున్నామని, భారత్లో అలాంటి సర్వీసెస్ ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ వల్లే సాధ్యమవుతోందని వివరించారు కేంద్రమంత్రి.
తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ని ఎంచుకున్న సఫ్రాన్ కు అభినందనలు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది
భారతదేశంలో ఇది LEAP ఇంజిన్ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్ హాల్ (MRO) సెంటర్
1000 మంది సాంకేతిక… https://t.co/8Tk4feZEKi pic.twitter.com/dOIAsp7yMz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2025