CM Revanth Reddy latest speech(Political news in telangana): ఎన్నికల్లో గెలిచేందుకు, ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ఈడీ, సీబీఐని వాడుకోవడం మోదీకి అలవాటేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై ఆయన స్పందించారు. ఓటుతో మోదీ, అమిత్షాకు బుద్ధి చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీను ప్రశ్నించాననే కారణంతోనే తనకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు పంపిన నోటీసులకు ఎవ్వరూ భయపడేవారెవరు లేరని.. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీని తప్పుకుండా ఓడించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా ఎడిటెడ్ వీడియోలు తిరుగుతుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల వేళ ఇరుకున పెట్టేందుకే బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్న భయంతోనే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని పీసీసీ నేతలు స్పష్టంచేశారు. నోటీసులు తీసుకున్నామని, వివరణ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి మార్ఫింగ్ పనులు చేసే అవసరం లేదని, ఏ తప్పూ చేయదని అన్నారు.
Also Read: రిజర్వేషన్లపై అమిత్ షా వీడియో.. తెలంగాణ సీఎంకు నోటీసులు..
ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లకు దెబ్బపడుతుందన్న భయంతోనే ఢిల్లీ పోలీసులు నోటీసులు పట్టుకుని పరుగున వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనే అక్కసుతోనే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్నితీసివేసి కొత్త రాజ్యాంగాన్ని తెచ్చే కుట్ర జరుగుతోందన్నారు.