CM Revanth Reddy: రెండేళ్లు నాకు సమయం ఇవ్వాలని, ఆర్ధిక వెసులుబాటును బట్టి మీ సమస్యలు పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదని, రెండేళ్ల తరువాత మీరు ఆశించినట్లుగా సమస్యలు పరిష్కరించకుంటే అప్పుడు ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం మార్చుకోవద్దని సూచించారు. మేం అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు పీఆర్సీ ఇవ్వాలని శ్రీపాల్ అంటున్నారని చెప్పారు. మీ ఉద్యోగ సర్వీస్ 30 ఏళ్లు ఉంటుందని, మాది కేవలం ఐదేళ్లు మాత్రమేనని అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఒకే ఒక్క కుటుంబం 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మీ సర్వీస్ను 60 ఏళ్లకు పెంచిందని వివరించారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ పెట్టి వెళ్లి ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రజా ప్రభుత్వం 6 వేల కోట్లు చెల్లించిందన్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని, పదేళ్లు విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారని గుర్తు చేశారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిద్దామని, అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. మీకు ఉపాధ్యాయులకు ఎలాంటి చిన్న సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది అని వెల్లడించారు.
పాలిటెక్నిక్ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని, మిమ్మల్ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని వివరించారు. దయచేసి అలాంటివారి ట్రాప్లో పడొద్దని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు మనమంతా పునరంకితమవుదాని తెలిపారు. గతంలో విద్యాభివృద్ధి 28వ స్థానంలో ఉంటే.. ప్రజా ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక 17 వ స్థానానికి చేరుకుందన్నారు ముఖ్యమంత్రి. ఇదంతా ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందన్నారు.
గడిచిన రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 88 వేలు పెరిగిందని వివరించారు. ఈ విజయం మీది, తెలంగాణ ప్రజలది అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం అడ్మిషన్లు జరిగాయని, సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా ముందుకెళుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడానికి సమర్థులైన వారిని యూనివర్సిటీల వీసీలుగా నియమించామన్నారు. ప్రజా ప్రభుత్వంలో 55 రోజుల్లో డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసింది నిజం కాదా?
25,950 టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేసింది నిజం కాదా? మీరే ఒక్కసారి ఆలోచించాలన్నారు. చిన్న వివాదం లేకుండా 34,706 మంది ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని, అందుకోసం 317 జీవో తీసుకొచ్చి పరిష్కరించామన్నారు. విద్య కమిషన్ ఏర్పాటు చేసి మీ సమస్యలను పరిష్కరిస్తున్నామని, కేశవరావును సలహాదారుగా నియమించి విద్యాశాఖ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి విద్యా విధానం అధ్యయనం చేయించారా? తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించింది నిజం కాదా? ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వాలని, వారిని గౌరవించాలని 123 మంది టీచర్లకు అవార్డులు అందిస్తున్నామని అన్నారు.
ALSO READ: ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్
నేనే మీ ప్రతినిధిగా సమస్యలను పరిష్కరిస్తా, రెండేళ్లు డెడికేటెడ్ గా విద్యార్థుల కోసం పని చేయాలన్నారు. దేశ విద్యావ్యవస్థకు దిక్సూచిగా తెలంగాణాను తీర్చిదిద్దుదామని, మనం చేస్తున్న మంచి పనులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. పిల్లల భవిష్యత్ కు ఏది మంచిదో చూడాలని, ప్రైవేటుగా ధీటుగా నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు ఎడ్యుకేషన్ తోపాటు స్కిల్స్ నేర్పించాలన్నారు. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, విద్యార్థుల భవిష్యత్ కు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని తెలిపారు. తల్లిదండ్రులకంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్ద ఎక్కువ సమయం గడుపుతారని, విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని సర్వేపల్లి రాధాకృష్ణన్ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.