Revanth Reddy MMTS Review: హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడి మెట్రోగా పేరుగాంచిన ఎంఎంటీఎస్ (MMTS) సేవలను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. గురువారం శాసనమండలి హాల్లో ఎంఎంటీఎస్ సేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏటేటా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, సేవలను మెరుగుపరిచేందుకు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయాలకు వెళ్లే రద్దీ సమయాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. రైళ్లు క్రమం తప్పకుండా సమయపాలన పాటించేలా చూడాలని, అప్పుడే ప్రయాణికులు వీటిపై నమ్మకంతో మొగ్గు చూపుతారని స్పష్టం చేశారు. స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ఎంఎంటీఎస్ ఆదాయం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద ప్రధాన సమస్యగా మారిన ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ (చివరి మైలు అనుసంధానం) పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు. చాలా స్టేషన్లు ప్రధాన రహదారులకు లోపలి వైపు ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు వెళ్లడం కష్టమవుతోందని గుర్తించారు. దీనికి పరిష్కారంగా స్టేషన్ల వరకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రయాణికులు సులభంగా స్టేషన్లకు చేరుకోగలుగుతారని తెలిపారు.
కేవలం ప్రయాణ టిక్కెట్లపైనే ఆధారపడకుండా, ఎంఎంటీఎస్ తన స్వీయ ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతుల మెరుగుదల, కనెక్టివిటీ సమస్యల పరిష్కారంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: India Oil Reserves: దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన