CM Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. నగర సుందరీకరణ మౌలిక సదుపాయాల కల్పన ఆదాయ వనరుల పెంపుదలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ దిశగా అడుగులు వేస్తూ జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అడ్వర్టైజింగ్ బోర్డుల కేటాయింపులో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం 10 శాతం బోర్డులను తప్పనిసరిగా కేటాయించాలని అలాగే అనధికార బోర్డులపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. అడ్వర్టైజింగ్ ఫీజును సంవత్సరానికి ఒకసారి వసూలు చేసేలా నిబంధనలు రూపొందించాలని కోరారు.
నగర జీవన ప్రమాణాల్లో కీలకమైన వీధిదీపాల నిర్వహణపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వీధిదీపాల పర్యవేక్షణ కోసం యూనికోడ్ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ విభజన తర్వాత తలెత్తిన పరిపాలన సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. మూడు కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు తానే స్వయంగా త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తానని ప్రకటించారు.
పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే బాధ్యులైన అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని స్పష్టం చేశారు. కమిషనర్లు జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ ఉదయాన్నే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని అన్ని పార్కుల వివరాలను సేకరించి వాటి నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని భావించిన ముఖ్యమంత్రి నూతనంగా ఎన్నికైన మేయర్లు మున్సిపల్ చైర్మన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్ హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
Read Also: Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు