CM Revanth Reddy: ఏపీలోని పుట్టపర్తి సాయిబాబా శతజయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశం అన్నారు. బాబా ప్రేమతో మనుషులను గెలిచారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని సీఎం తెలిపారు.
ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి బాబా ట్రస్టు నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి చదువు అందించాలని సత్యసాయిబాబా బలంగా విశ్వసించారన్నారు. ఎల్ కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచిత విద్యను అందించారని తెలిపారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందించేలా చేశారన్నారు. పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
Also Read: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే కాకుండా తమిళనాడులో కూడా త్రాగునీటి సమస్యను పరిష్కరించిన గొప్ప సమాజ సేవకులు సత్యసాయి బాబా అని కొనియాడారు. తన ప్రేమ సందేశం ద్వారా మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానాన్ని పదిలం చేసుకున్నారని సీఎం తెలిపారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని సత్యసాయి బాబా అందించారని వెల్లడించారు. 140 దేశాల్లో సత్య సాయిబాబాకు భక్తులు ఉన్నారని వివరించారు. ఆయన మన మధ్యలో లేకపోయినా.. వారి ఆలోచన, స్ఫూర్తి, శతజయంతి ఉత్సవాల్లో కనిపిస్తోందని అన్నారు.