CM Revanth Reddy: సిద్దిపేట జిల్లా నర్మెట్ట రైతు మహోత్సవం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడే ధోరణిని వీడాలని హితవు పలుకుతూనే, సిద్దిపేట ప్రాంతంపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ప్రజాక్షేమం కోసం తాము ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
“ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కావాలనుకుంటే నా సొంత నియోజకవర్గం కొడంగల్కు తీసుకుపోవచ్చు, కానీ నేను అలా చేయలేదు. సిద్దిపేటపై నాకు ఎలాంటి వివక్ష లేదు” అని ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పేదల కోసం 3,500 ఇళ్లను మంజూరు చేశామని గుర్తుచేశారు. 2014 నుంచి కొడంగల్కు ఎన్ని నిధులు వచ్చాయో చూస్తే.. వివక్ష అంటే ఏంటో అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
మూసీ పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. “నా సొంత ప్రాంతంలో ప్రాజెక్టు కట్టినప్పుడు అక్కడి రైతులను ఒప్పించి మెప్పించి పనులు పూర్తి చేశాం. కానీ మల్లన్నసాగర్ విషయంలో మీరు (గత ప్రభుత్వం) ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలియదా?” అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే అడ్డుతగలడం సరికాదని, ప్రతిపక్షం అంటే ప్రజల కోసం పని చేయాలి తప్ప అభివృద్ధిని ఆపడం కాదని మండిపడ్డారు. “అడ్డం పడుకుంటే ఆగిపోయే ప్రభుత్వం మాది కాదు” అని ధీమా వ్యక్తం చేశారు.
సిద్దిపేట అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడూ వివక్ష చూపలేదని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. “రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో సమానంగానే సిద్దిపేటను చూస్తాం. మాకు ఎటువంటి భేషజాలు లేవు. అదృష్టం బాగుండి స్థానిక ఎంపీ రఘునందన్ రావు మంచి స్థాయిలో ఉంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన్ని కూడా కలుస్తాం” అని పేర్కొన్నారు. అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కలిసి నడుస్తామని హామీ ఇచ్చారు.
గతంలో మల్లన్నసాగర్ నిర్వాసిత రైతుల పోరాటంలో తాము అండగా నిలిచామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయాల కోసం కాకుండా పేదల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. “2029లో మళ్ళీ సిద్దిపేట వస్తాం. ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని కచ్చితంగా మంత్రిని చేస్తాం” అని ప్రకటించారు. సిద్దిపేట ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ బలోపేతం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎరువుల సరఫరాకు ఆటంకం ఏర్పడి, యూరియా కొరత వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాజకీయాలను పక్కనబెట్టి పనిచేస్తామని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యే యూరియా మొత్తం తెలంగాణ రైతాంగానికే దక్కాలని.. దీనికోసం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి స్వయంగా ప్రధానమంత్రి మోదీని కలుస్తానని ప్రకటించారు. “ప్రధాని మోదీ వస్తే నేను వస్తా.. నేను వస్తే ఎంపీ వస్తారు.. ఇదే మంచి సంప్రదాయం” అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Rythu Bharosa Funds Release: రైతన్నలకు సీఎం రేవంత్ ‘భరోసా’.. రూ. 3,600 కోట్లు విడుదల.. ఖాతాల్లో జమ!