Revanth Reddy: సీతారాంపూర్ లో జరిగిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఆరోపణలు ఎన్ని వచ్చినా వెనకడుగు వేసేది లేదని, తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, స్థానిక రైతుల త్యాగాలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు మాట్లాడారు.
కాలుష్య రహిత హైదరాబాద్..
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం వల్ల జీవించలేని పరిస్థితి ఏర్పడిందని, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో పాలిటన్ నగరాలు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయని సీఎం గుర్తుచేశారు. హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే కాలుష్య రహిత అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2100 చదరపు కిలోమీటర్ల పరిధిని పూర్తిగా ‘CURE’ (క్యూర్) ఏరియాగా ప్రకటించి, కేవలం సర్వీస్ సెక్టార్కే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని CURE, PURE, RARE ఏరియాలుగా విభజించి సరికొత్త పంథాలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
2030 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇప్పుడున్న పెట్టుబడులు సరిపోవని, మరిన్ని పెట్టుబడులు రావాలంటే మౌలిక వసతుల కల్పన అత్యంత అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించేందుకు ఏటీసీలతో పాటు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 100 మీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతోందని, ప్రజలందరి సహకారంతో 2030 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ సంకల్పమని ప్రకటించారు.
భూనిర్వాసితులకు అండగా ప్రభుత్వం
సీతారాంపూర్ లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభం కావడం శుభపరిణామమన్న సీఎం.. రంగారెడ్డి జిల్లా రైతుల త్యాగాల వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. ఇక్కడ భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని, వారి ఉపాధి కోసం వ్యాపార సముదాయాలను (కమర్షియల్ కాంప్లెక్స్) నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయాలు పక్కనబెట్టి.. పని చేయనివ్వండి
ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని, ఎన్నికలప్పుడే రాజకీయాలు చూసుకోవాలని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. ‘అధికారం కోల్పోయిన బాధ మీకు ఉన్నా.. అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. మమ్మల్ని కొన్నాళ్ల పాటు ప్రశాంతంగా పని చేయనివ్వండి’ అని కోరారు. త్వరలోనే ఇక్కడ నిర్మిస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి మళ్లీ వస్తానని, స్థానిక ప్రజలను కలుసుకుంటానని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.