CM Revanth Reddy: హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ఉన్న విశిష్టమైన పేరు ప్రఖ్యాతులను గుర్తు చేశారు. 1950 నుండి 1960 వరకు హైదరాబాద్ను Nursery of Indian Football గా పిలిచేవారని, దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ నగరం అందించిందని కొనియాడారు. 1956 ఒలింపిక్స్లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహించిన వారిలో ఏడుగురు హైదరాబాద్కు చెందిన వారేనని, హైదరాబాద్ పోలీస్ ఫుట్బాల్ జట్టుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత తరం యువత మైదానాలను వదిలి క్రీడలకు దూరం అవుతుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో తాను సందర్శించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి వివరిస్తూ.. కేవలం 30 ఎకరాల్లో ఉన్న ఆ సంస్థ అనేక అంతర్జాతీయ పతకాలను సాధించిందని తెలిపారు. 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా 30కి పైగా ఒలింపిక్ పతకాలు సాధిస్తుంటే, 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఆ స్థాయిలో రాణించలేకపోవడంపై పునరాలోచన చేయాలని కోరారు. ఆ దేశంలో ఒక్క అమ్మాయి రెండు బంగారు పతకాలు సాధించడాన్ని ఉదాహరణగా చూపిస్తూ, మన యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పబ్ కల్చర్.. డ్రగ్స్ బారిన పడుతున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాగా చదువుకున్న యువత సైతం డ్రగ్స్ వ్యసనానికి గురవుతుండటం విచారకరమని, ఒకప్పుడు వీరులను అందించిన పంజాబ్ రాష్ట్రం నేడు డ్రగ్స్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఉదాహరించారు. తెలంగాణను మరో పంజాబ్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం నేరాల తీరు మారిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది రెండు వైపులా పదునున్న కత్తిలా మారిందని, సైబర్ నేరాలను అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో (PPP) నడిచే ఈ యూనివర్సిటీ బోర్డులో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. యువతకు మార్గదర్శనం చేసేందుకే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్కు తీసుకువచ్చామని, ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు ఆయనతో కలిసి ఆడే అపూర్వ అవకాశాన్ని కల్పించామని గుర్తు చేశారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో క్రీడల్లో రాణించే యువతకు ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయని సీఎం హామీ ఇచ్చారు. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్కు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ. 2 కోట్ల నగదు పురస్కారం అందించామని తెలిపారు. క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పదో తరగతి ఫెయిల్ అయినా, నిబంధనలు సడలించి మరీ డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని, పారా ఒలింపిక్స్లో రాణించిన దీప్తి జురాంజికి కూడా గ్రూప్-1 ఉద్యోగం కల్పించామని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సీఐఎస్ఎఫ్ (CISF) జట్టుకు ట్రోఫీని అందజేస్తూ, దేశం కోసం మరియు క్రీడల కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!