తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఓ రేంజ్ లోమండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరుకాకపోవడాన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. విధులకు రాని ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు ఇవ్వాలా వద్దా అనే అంశంపై సభలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు అలాగే ఉన్నాయని సీఎం ఎద్దేవా చేశారు. ప్రజలు అధికారం నుంచి దూరం చేసినా ఇంకా తామే రాజులమనే అహంకారంలో బీఆర్ఎస్ నేతలు ఊగిపోతున్నారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి హుందాగా ధన్యవాదాలు తెలపాల్సింది పోయి.. సభను తప్పుదోవ పట్టించేలా విపక్షాలు వ్యవహరించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాచరికపు ధోరణితో ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరచడం సరికాదని హితవు పలికారు.
ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటూ కేసీఆర్ ఇప్పటివరకు రూ. 1.06 కోట్ల జీతభత్యాలను పొందారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ సభకు రాకపోవడం దారుణమన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభకు హాజరుకాకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. సభకు రాని వారికి జీతాలు చెల్లించడంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న సంకల్పానికి అద్దం పడుతోందని సీఎం కొనియాడారు. రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ రూపొందించిన ‘రైజింగ్ తెలంగాణ-2047’ డాక్యుమెంట్ను ప్రతిపక్ష సభ్యులు కనీసం చదవకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వారు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్కు కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా విపక్ష నేత రాకపోవడం రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని ధ్వజమెత్తారు.
కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షం బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అసెంబ్లీ అనేది ప్రజల గొంతుక అని.. ఇక్కడ చర్చలు అర్థవంతంగా సాగాలని ఆకాంక్షించారు. నియంతృత్వ ధోరణులను వీడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతాల అంశంపై స్పీకర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదని అన్నారు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలని చెప్పారు. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని వివరించారు. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతామని చెప్పారు. ‘రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్కు శ్రీధర్ బాబు కౌంటర్