Minister Sridhar Babu: స్వేచ్ఛ, బ్యూరో: మూసీ పునరుజ్జీవనంపై బీఆర్ఎస్ పార్టీ బురద చల్లడం ఆపాలని, బీఆర్ ఎస్ వైఖరి మొదటి నుంచి మేం బురద చల్లుతుంటాటం, మీరు తూడ్చుకోండి అన్నట్టుగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం అసెంబ్లీలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ మధ్య మాటల యుద్దమే జరిగింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్ రూ.6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఖర్చవుతున్నాయని తాము స్పష్టంగా చెప్పామని వివరించారు. కేటీఆర్ మాత్రం లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో బురద చల్లుతున్నారని ఆక్షేపించారు. తాము పారదర్శకంగా ప్రతిదీ ప్రజల ముందు పెడుతున్నామని, ఇందులో దాపరికాలేవీ లేవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
మూసీ కాలుష్యం అనేది జంట నగరాలకు సంబంధించిన ప్రధాన సమస్య అని, పరిష్కారం కోసం తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని బీఆర్ఎస్ పార్టీ పనికిరాని ఆరోపణలు చేస్తుందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్ గా గుర్తిస్తూ 2016 లో అప్పటి మీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే చేస్తున్నామని, మీ ప్రభుత్వం జీవో ఇచ్చింది నిజం కాదా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని అడుగుతున్నరని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. పేదలకు పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఆయన వివరించారు. ఆ పార్టీకి ప్రజల మేలు గురించి అవసరం లేదు. మేం ఏ సంకల్పం మొదలు పెట్టినా అభాండాలు వేయడం, బీఆర్ఎస్ కు అలవాటై పోయిందని విమర్శించారు. ప్రజల మేలు కంటే రాజకీయ ఆరోపణలకే బీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో చాలా అనుభవముందని మంత్రి సభాముఖంగా వివరించారు.
Also Read: Tirumala Darshan: తిరుమలలో త్వరగా దర్శనం చేసుకోవడానికి ఏడు మార్గాలు – అవేంటో తెలుసా
డీపీఆర్ రెండు నెలల్లో తయారు చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధాలని, 2024 డిసెంబర్ లో డీపీఆర్ రూపకల్పన పనులు మొదలయ్యాయని, పూర్తి చేసేందుకు ఏడాది పట్టిందని ఆయన వివరించారు. మూసీపై ఇటీవల నిర్వహించిన పీపీటీ ప్రజెంటేషన్ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానించామని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించినా, వారు హాజరు కాలేదని వెల్లడించారు. రుణం కోసం ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) కి డీపీఆర్ పంపించామని త్వరలోనే దానికి ఆమోదం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు మంత్రి వివరించారు. ఇప్పటికే ప్రాథమికంగా సంతృప్తిని వ్యక్తం చేసిన ఏడీబీ, త్వరలో జరగనున్న బ్యాంక్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు. ఏడీబీ తిరస్కరించడం అనేది అవాస్తమని తెలిపారు. ఏ పరిస్థితుల్లోనైనా ఏడీబీ మూసీ ప్రాజెక్టు చేయటం వీలు లేకపోతే, పీపీపీ పద్దతి వంటి ఇతరత్రా మార్గాలను అన్వేషించి, ఎట్టి పరిస్ధితుల్లో మూసీ పునరుజ్జీవనం, ప్రక్షాళన వంటి పనులు చేపడుతామని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవనం, ప్రక్షాళన ప్రాజెక్టు చాలా పాత ప్రాజెక్టు అని, పరివాహాక ప్రాంతా ప్రజలు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణలో జీవించేందుకే సర్కారు ఎంతో గొప్ప సంకల్పంతో మూసీ ప్రాజెక్టు చేపడుతుంటే, వారి బతుకులు బాగుపడటం బీఆర్ఎస్ కు ఇష్టంలేదా? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేరుగా కేటీఆర్ ను ప్రశ్నించారు. గత పాలకుల హయాంలో కూడా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలను సిద్దం చేసినందున, వారి విలువైల సలహాలను అడిగినా, వారు సమర్పించకుండా మూసీ ప్రాజెక్టుపై లేనిపోని వివాదాలను సృష్టిస్తుందన్నారు.
డిప్యూటీ సీఎం సొంత జిల్లా అయిన ఖమ్మంలోని వెలుగుమెట్లలో ఇండ్లను కూల్చుతున్న విషయంపై డిప్యూటీ సీఎంకే సమాచారం లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యానించటాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా తప్పు బట్టారు. కేటీఆర్ మాట్లాడుతుండగానే జోక్యం చేసుకున్న మంత్రి తుమ్మల వెలుగుమెట్ల ఇళ్ల కూల్చివేత ఘటనపై సభలో డీటైల్ గా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, మీరు సిద్దంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చర్చ ప్రారంభిస్తే బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉండలేరని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు.
Also Read: Galaxy S25 Ultra Price Drop: గోల్డెన్ ఛాన్స్ మావా.. శాంసంగ్ ప్రీమియం ఫోన్పై రూ.24వేల తగ్గింపు!