దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి వేదికగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ ప్రణాళికలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల విధానాలను ముఖ్యమంత్రి వివరించారు. కేవలం పెట్టుబడులే లక్ష్యం కాకుండా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రూపొందించుకున్న విజన్ను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని టాటా చైర్మన్ ఈ సందర్భంగా అభినందించారు.
తెలంగాణలో క్రీడా రంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్లోని ప్రధాన స్టేడియాలను అభివృద్ధి చేసే అంశంపై వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. 2036 ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి స్పందించిన చంద్రశేఖరన్, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, 65 ప్రభుత్వ ఐటీఐలను సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్ అందిస్తున్న సహకారం గురించి సీఎం ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు’పై టాటా చైర్మన్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. గతంలో రాజస్థాన్, మహారాష్ట్రలో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్ సాధించిన అనుభవాన్ని మూసీ అభివృద్ధికి జోడిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు.
ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో లగ్జరీ హోటళ్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ను నిర్మించే ప్రతిపాదనపై కూడా చర్చలు జరిగాయి. వీటితో పాటు ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ రంగాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలపై చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు. ఈ భేటీలో మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తెలంగాణ ప్రగతి ప్రణాళికలను వివరించారు.
ALSO READ: Jeevan Reddy: అవమానం భరించలేను.. కాంగ్రెస్ సమావేశం నుండి వెళ్లిపోయిన జీవన్ రెడ్డి