తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమన్వయ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్టీ బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన కోసం ఏర్పాటు చేసిన ఈ భేటీ నుండి సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్యలోనే నిష్క్రమించారు. తనకు జరిగిన అన్యాయానికి, అవమానానికి నిరసనగా తాను ఈ సమావేశంలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ ఆయన బయటకు వెళ్లిపోయారు.
అవమానం భరించలేను..
సమావేశం నుండి బయటకు వచ్చిన అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన పథకాల వల్ల రాష్ట్రంలో పార్టీ 100 శాతం విజయం సాధిస్తుంది, అందులో సందేహం లేదు. కానీ, దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ అరాచకాలపై ప్రాణాలకు తెగించి పోరాడిన మా లాంటి సీనియర్లకు ఇప్పుడు సొంత పార్టీలోనే అవమానం ఎదురవుతోంది’ అని ఆయన వాపోయారు.
ప్రధాన అభ్యంతరం ఏమిటి..?
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ అధికారిక సమీక్షా సమావేశానికి ఆహ్వానించడంపై జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. ఇంకా కాంగ్రెస్ కండువా కప్పుకోని ఇతర పార్టీ ఎమ్మెల్యేను మా పక్కన కూర్చోబెడితే మాకు గౌరవం ఎక్కడ ఉంటుంది?’ అని ఆయన ప్రశ్నించారు. సదరు ఎమ్మెల్యే కేవలం అభివృద్ధి కోసమే మద్దతు ఇస్తున్నానని చెబుతున్నారని, అధికారికంగా పార్టీలో చేరలేదని, అటువంటప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాల చర్చలో ఆయనకు చోటు ఎలా ఇస్తారని నిలదీశారు.
మున్సిపల్ ఎన్నికల చర్చపై ప్రశ్నలు..
ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలను ఎలా చర్చిస్తారని జీవన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కొట్లాడుతున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ చర్య తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తాను సమావేశంలో ఉండటం సమంజసం కాదని భావించి.. నన్ను క్షమించండి అని చెబుతూ అక్కడ నుండి వెనుతిరిగారు. ఈ ఘటనతో నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.