Gold Price Hike Union Budget | భారతీయులందరికీ బంగారం అంటే అదో మోజు. దానికున్నంత క్రేజ్ మరే వస్తువుకు లేదు. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో సామాన్యులకు బంగారం దూరమవుతోంది. అయినా తమ స్థాయి తగట్టు ఎంతో కొంత బంగారాన్ని భారత ప్రజలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. కొందరు నగల రూపంలో కొనుగోలు చేస్తే.. మరి కొందరు ఆర్థిక భద్రత కోసం పెట్టుబడి రూపంలో కొంటున్నారు. అందుకే 2024 రెండో అర్థంలో భారతదేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్లో దిగుమతి సుంకాలను తగ్గించడంతో దీనికి మరింత ప్రోత్సాహం లభించిందని నిపుణులు చెబుతున్నారు.
కానీ ప్రభుత్వం ఈసారి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందన్న అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బంగారం కారణంగా జీడీపీకి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి ఈ ఏడాది కాలంలో కనిపించలేదు. ఈ అంశమే ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసిందని.. ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక వ్యవస్థకు తలనొప్పి
బంగారం దిగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ద్రవ్యలోటు పెరగడం, కరెన్సీ విలువ పతనానికి దారితీస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే రూ.87 వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది బంగారు దిగుమతులు ఎక్కువ కావడం కూడా ఒకటి. 2024 డిసెంబర్ 16న విడుదలైన వాణిజ్య గణాంకాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యలోటు బయటపడింది. దీనికి బంగారం కొనుగోళ్లే ప్రధాన కారణమని తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 14.8 బిలియన్ డాలర్ల మేరకు బంగారం దిగుమతి చేసుకోగా, దీనిలో 21% మాత్రమే వినియోగ ప్రయోజనాల కోసం కొనుగోలు చేయబడింది. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండవ దేశంగా భారత్ నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మొదటి స్థానంలో చైనా ఉంది.
గత జులైలో విడుదలైన బడ్జెట్లో బంగారం దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఒక్కసారిగా బంగారం కొనుగోళ్లు పెరిగిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల్లో 104% వృద్ధి కనిపించిందంటే కేంద్ర నిర్ణయం ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలల్లో కూడా బంగారం కొనుగోళ్లలో వృద్ధి కనిపిస్తూనే ఉంది.
సుంకాలు మరింత తగ్గించాలని పరిశ్రమ డిమాండ్:
మరోవైపు, నగల పరిశ్రమ బంగారం దిగుమతి సుంకాలను మరింత తగ్గించాలని బలంగా డిమాండ్ చేస్తోంది. అప్పుడు బంగారం ధర కూడా తగ్గుతుందని వారు వాదిస్తున్నారు. దీనికితోడు, స్మగ్లింగ్ను అరికట్టవచ్చని నగల వ్యాపారులు సూచిస్తున్నారు. నగల తయారీ సంస్థలకు మూలధన వ్యయాలు తగ్గడం, పోటీ పెరగడం వంటివి సాధ్యమవుతాయని, దీంతో పరిశ్రమ మరింత మెరుగుపడుతుందని బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: భారతదేశంలో అత్యధిక పన్ను శాతం ఉన్న వస్తువులు, సేవలు ఇవే..
మరోవైపు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఈసారి బడ్జెట్లో దిగుమతి సుంకాలు పెరిగితే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తోంది. స్మగ్లింగ్ పెరగడంతోపాటు, దేశీయంగా బంగారం ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని కౌన్సిల్ వ్యాఖ్యానించింది. సుంకాలు పెరిగితే జువెలరీ పరిశ్రమను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
గత బడ్జెట్లో బంగారం, వెండి వస్తువులు, కడ్డీల (మేలిమి బంగారం)పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. ఇప్పటివరకు బంగారం, వెండిపై 10% బీసీడీ ఉండగా, దీన్ని 5%కి పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా విధించే వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం (ఏఐడీసీ)ని 5% నుంచి 1%కి తగ్గించడంతో మొత్తంగా 6%కి తగ్గింది. ఈసారి బడ్జెట్లో దీన్ని మరింత తగ్గించి 2%కి చేర్చాలని జెమ్ అండ్ జువెలరీ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరింది.
అప్పుడే ప్రపంచ మార్కెట్లోని బంగారం ధరలకు భారత్ చేరుకుంటుందని కౌన్సిల్ పెద్దలు వాదిస్తున్నారు. అలా చేస్తేనే దుబాయ్ వంటి మార్కెట్లకు బదులు విదేశీయులు భారత్లో నగలను కొనుగోలు చేస్తారని వారు చెబుతున్నారు. అదే సమయంలో, విదేశీ పర్యటకులు చేసే జువెలరీ కొనుగోళ్లపై ఒకసారి జీఎస్టీ రీఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇవి అంతర్జాతీయ కొనుగోలుదారుల దృష్టిలో భారత్ను ఆకర్షణీయంగా మారుస్తాయని సూచించారు.
పాన్కార్డ్ పరిమితిలో మార్పులు:
రూ.2 లక్షల పరిమితి దాటి బంగారం కొనుగోలు చేస్తే భారత్లో పాన్కార్డు తప్పనిసరి. ఈసారి బడ్జెట్లో ఈ పరిమితిలో మార్పులు జరగొచ్చని చెబుతున్నారు. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని నగల పరిశ్రమ కోరుతోంది. దీంతోపాటు, నగదు కొనుగోళ్లకు రూ.5 లక్షలను పరిమితిగా నిర్ధారించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, భారత విదేశీ మారకద్రవ్య నిల్వలపై భారం తగ్గించేలా, రూపాయి విలువను కాపాడేలా ఆర్థిక మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
2024లో నెలవారీ బంగారం దిగుమతులు (టన్నుల్లో):