Telangana Politics: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. కాకపోతే బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం తీర్పుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సీఎం రేవంత్రెడ్డి.. పార్టీ కీలక నేతలు, మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో లోకల్ సందడి మొదలు
గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు హాజరయ్యారు. స్థానిక ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల సెలక్షన్స్, నామినేషన్లపై దృష్టి సారించారు. తొలి విడత అభ్యర్థుల జాబిజతా ఈ రాత్రికి సిద్ధం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
అలాగే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు, ఎన్నికల ఏర్పాట్లపై సిద్ధంగా ఉండాలన్నారు. సమర్ధవంతమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. అంతేకాదు అన్ని జిల్లాలు క్లీన్ స్వీప్ చేసేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. జిల్లాల్లో నాయకులతో ఇంచార్జ్ మంత్రులు ఎప్పటికప్పుడు మాట్లాడాలన్నారు. అభ్యర్థులను ఫైనల్ చేసి వెంటనే బీ ఫారం ఇవ్వాలని సూచన చేశారు. నో డ్యూస్ సర్టిపికేట్లు ఇప్పించాలని, లీగల్ సెల్ను యాక్టివ్ చేయాలన్నారు.
పార్టీ నేతలతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్
గాంధీ భవన్లో లీగల్ టీమ్తో పాటు సమన్వయం కోసం ఓ టీమ్ అందుబాటులో ఉండాలన్నారు. రిజర్వేషన్లపై న్యాయస్థానం కోర్టు తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
అప్పటివరకు రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని సూచన చేశారు. ఇదే సమయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ మొదలైందన్నారు. పార్టీ పరంగా అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు. క్లీన్ స్వీప్ కోసం అందరం ప్రయత్నం చేయాలన్నారు. అందరిలోనూ కనిపించాలని, క్యాడర్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. 15 రోజులు అందరూ కష్టపడాలన్నారు.
ALSO READ: పెంచిన బస్సు ఛార్జీలను వెనక్కి తీసుకోవాల్సిందే
అటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా పరంగా సిద్ధంగా ఉన్నామని, అభ్యర్థుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మా ప్రాంతంలో స్వీప్ చేస్తామని, నార్త్ తెలంగాణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.
స్థానిక సంస్థలు నోటిఫికేషన్ విడుదలైందని, తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో నామినేషన్లు మొదలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు చాలా సీరియస్గా ఉండాలని, వీలైనంత త్వరగా నామినేషన్లు వేయాలన్నారు. దేశ చరిత్రలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అనేది సామాజిక విప్లవంగా వర్ణించారు.