CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. శ్రీ రామనవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఆయన పర్యటించారు. ఈ మేరకు లబ్ధిదారుడు శ్రీనివాస్ కుటుంబ కష్టసుఖాల గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇక ఉదయం భద్రాచలంలో నిర్వహించిన సీతా రాముల కల్యాణోత్సవానికి హాజరైన సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన విషయం తెలిసిందే.
అక్కడి సన్న బియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. అలాగే సీఎం వెంట వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా అక్కడే సీఎంతో కలిసి భోజనం చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 30న ప్రారంభించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ఈ స్కీంను ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపిన విషయం విదితమే. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్కార్డులు జారీ కానున్నాయని ఆమె పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు. ధనవంతుల లాగే పేదవారు కూడా సన్నబియ్యం తినాలని కోరుతున్నారని చెప్పారు. గత ఏడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని చెప్పుకొచ్చారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని తెలిపారు.
సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం
కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళ హారతితో స్వాగతం
పలికిన మహిళలు pic.twitter.com/tON4VweuMh— BIG TV Breaking News (@bigtvtelugu) April 6, 2025