
CM Revanth Reddy’s public meeting in Kodangal: కొడంగల్ ఆశీర్వాదంతోనే తాను ముఖ్యమంత్రి కాగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోస్గి లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో పాలమూరు ప్రజలు ఆ నాడు వలస వచ్చిన కేసీఆర్ ను ఆదుకున్నారన్నారు.
కేసీఆర్ ఎంపీగా గెలిస్తే పాలమూరుకు చుక్కనీరు ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కరీంనగర్ నుంచి గెలవరనే కేసీఆర్ మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఓట్ల కోసం కేసీఆర్ వస్తున్నారన్నారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. పాలమూరు గడ్డ తనను ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకుందని అన్నారు.
పాలమూరు అభివృద్ది జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక యుద్ధం ముగియలేదన్నారు. ఇది విరామం మాత్రమేనన్నారు. పార్లమెంట్లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్ గెలిచినట్లని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి బరిలో ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
Read More: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..
10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలేని దద్దమ్మ పాలన చేశారని సీఎం రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు. ప్రజలు ఛీ కొట్టినా బీఆర్ఎస్ నేతలకు సిగ్గురాలేదన్నారు. పదేళ్లలో వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు అప్పజెప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.పాలమూరు అభివృద్ది జరగాలంటే వంశీ చంద్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.