తెలంగాణ రాష్ట్ర రాజధానిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను (CURE) ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, నగర పాలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
పాలనలో సమూల మార్పులు..
పరిపాలనను మరింత ప్రజలకు చేరువ చేసేందుకు క్యూర్ పరిధిలోని నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించినట్లు సీఎం వెల్లడించారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రజలకు అందించే జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీలో ఆధునిక సాంకేతికతను జోడించి.. గుడ్ గవర్నెన్స్ నుండి స్మార్ట్ గవర్నెన్స్ వైపు అడుగులు వేయాలని సూచించారు.
హైదరాబాద్లో అతిపెద్ద సవాలుగా ఉన్న చెత్త నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, రోడ్లపై ఎక్కడా చెత్తగానీ, గుంతలుగానీ కనిపించకూడదని స్పష్టం చేశారు. నెలకు మూడు రోజులు శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు, ప్రతి 10 రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ చేపట్టాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడటం జోనల్ కమిషనర్ల ప్రధాన బాధ్యత అని సీఎం గుర్తుచేశారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ యార్డుల వద్ద నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనవరి నుంచే హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు సమన్వయంతో నాలాల పూడికతీత పనులు ప్రారంభించాలని సూచించారు.
ప్రజా భాగస్వామ్యం..
పాలనలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని, వారితో నిరంతరం కమ్యూనికేషన్ కొనసాగించాలని సీఎం సూచించారు. దోమల నివారణ, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశిస్తూ, రాబోయే ఐదేళ్ల కాలానికి పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ALSO READ: Hyderabad Metro Rail: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు.. న్యూ ఇయర్ వేళ సమయాల్లో మార్పులు