CM Revanth Reddy: తెలంగాణలో విద్యా విధానం కొంత ఆందోళనకరంగా ఉందన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఇది ఎవరు అవునన్నా.. కాదన్నా ముమ్మాటికీ నిజమన్నారు. దీన్ని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవాళ్లమి అవుతామన్నారు. చదువు ఎన్ని అవకాశాలు ఇస్తుందో తనకు తెలుసన్నారు. పేదలకు విద్య ఎంత అవసరమో ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు బాగా తెలుసన్నారు.
మండలిలో సీఎం కీలక వ్యాఖ్యలు
బుధవారం రాత్రి శాసనభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. దీనికి కేవలం ప్రభుత్వమే కాదు.. తెలంగాణ సమాజం బాధ్యత వహించాలన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.
ప్రక్షాళన మొదలు పెడదామంటే పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని సభలో చెప్పేశారు ముఖ్యమంత్రి. రాజకీయ కోణంలో ఆలోచన చేసినన్ని రోజులు ప్రక్షాళన చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడిందన్నారు. విద్యా వ్యవస్థపై రాత పూర్వక సూచనలు, సలహాలు ఇస్తే ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మీ అందరి సూచనలతో ఒక పాలసీ డాక్యుమెంట్ రూపొందిస్తామని, దానిపై చర్చ పెడదామన్నారు సీఎం. ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే ఇక ఎప్పుడు ప్రక్షాళన చేయలేమన్నారు. ఇప్పటికీ మేల్కొనకపోతే భవిష్యత్ తరాలకు మనం ద్రోహం చేసిన వాళ్లం అవుతామని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: రెండు గ్రూపుల మధ్య స్ట్రీట్ ఫైటింగ్, ఆపై దాడులు
విద్యా విధానంపై వ్యాఖ్యలు
రెగ్యులర్ ఎడ్యుకేషన్ను స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. కేవలం నిధుల కేటాయింపు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కాదన్నారు. మనందరం సామాజిక బాధ్యతగా భావిస్తేనే సమస్యను పరిష్కరించగలమన్నారు. అవసరమైతే భవిష్యత్లో విద్యాశాఖను తన వద్ద పెట్టుకుని నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇందులో భాగంగానే నెలకు ఒక రోజైనా హాస్టల్లో నిద్ర చేయాలని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు సీఎం రేవంత్రెడ్డి. పిల్లలతో అధికారులు ఇంటరాక్ట్ అయితే సమస్యలు తెలుస్తాయన్నారు. నిధుల సమస్య వుంటే రిలీజ్ చేసి పరిష్కరిస్తామన్నారు. మధ్యాహ్నం పథకానికి ఒకప్పుడు నిధులు వచ్చేవి కావన్నారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు.
ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలగాలనే నిర్ణయాలు తీసుకుందన్నారు. టీచర్ల రిక్రూట్మెంట్, బదిలీలు, ప్రమోషన్లపై ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుందన్నవారు. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు ఈ వేగం పనికి రాదన్నారు. తన నిర్ణయంతో వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని భావించడం లేదన్నారు. ఈ విషయంలో మన గౌరవం పొందాలనుకుంటే కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సభ్యుల సూచనలు, సలహాలు
సభ్యుడు తీన్మార్ మల్లన్న చేసిన సూచన బాగుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేవలం చర్చ మాత్రమే పెడుతున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ నిబంధన ఉందన్నారు. ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హులనే నిబంధనపై పార్టీల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. జనాభా తగ్గితే వచ్చే సమస్యలు ఇప్పుడు చూస్తున్నామని అన్నారు.
స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని అనుకున్నవారు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని నిబంధన పెడితే బాగుంటుందన్నారు సీఎం రేవంత్. దీనివల్ల పాఠశాలలు బాగుపడతాయన్నారు. ఈలోగా ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జోక్యం చేసుకున్నారు. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చవిస్తే వ్యవస్థ బాగుంటుందన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం తనకు లేదన్నారు. మీరంతా సూచనలు చేస్తే నిర్ణయం తీసుకోవడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే నిబంధన పెడితే ఉపయోగం ఉంటుందన్నారు. తాను మాట్లాడుతున్నది ఏదీ ప్రభుత్వ నిర్ణయం కాదన్నారు.
వివిధ మార్గాల ద్వారా తన దృష్టికి వచ్చిన వాటిని సభ ముందు పెడుతున్నట్లు తెలిపారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడో దగ్గర మనసు అర్థం చేసుకుని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
సర్వే వివరాలు బయటకు
2021 నేషనల్ అచీవ్మెంట్ సర్వే వివరాలను బయటపెట్టారు. ఈ సర్వేలో మూడు, ఐదో తరగతి చదివే వారిలో 75 శాతం మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో కనీస ప్రాధమిక సామర్థ్యం కూడా చూపలేదన్నారు. సబ్జెక్టులవారీగా దేశంలో 37 ర్యాంకుల్లో తెలంగాణ ఉందన్నారు.
మూడో తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మన రాష్ట్రం 36వ ర్యాంకు కాగా, గణితంలో 35వ ర్యాంకు, ఈవీఎస్లో 36వ ర్యాంకు తెలిపారు. ఇక ఐదో తరగతికి విషయానికొస్తే తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మనది 36వ ర్యాంకు అని తెలిపారు. గణితంలో 35, ఈవీఎస్లో 36 వ ర్యాంకు ఉందన్నారు.
మూడో తరగతిలో కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగిన వారు 2018లో 18.1 శాతం ఉంది. అదే 2022 నాటికి 5.2 శాతం పడిపోయింది. గతేడాది 6.3 శాతానికి పెరిగిందన్నారు. ఐదో తరగతిలో కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగిన వారు 2018లో 43.6 శాతం ఉంది. 2022లో 31.7 శాతానికి పడిపోయింది. 2024లో 31.5 కాస్త తగ్గిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేవారి సంఖ్య 6.50 లక్షలు తగ్గిందన్నారు. 10 వేల మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎలాంటి ఆరోపణలు లేకుండా 36 వేల మంది టీచర్లను బదిలీలు పూర్తి చేశామన్నారు.
అందుకే ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు సీఎం. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని గుర్తు చేశారు. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యునివర్సిటీ, అకాడమీని ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. త్వరలో స్పోర్ట్స్కు సంబంధించి విధివిధానాలతో మీ ముందుకు వస్తామన్నారు.
ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి చెప్పి 100 నియోజకవర్గాల్లో వంద ఏటీసీలను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. అలాగే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.