రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా ఆయా సెగ్మెంట్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పదేండ్లు అధికారంలో ఉంటుందని, అందుకు గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎలా అధికారంలోకి వచ్చాయో గుర్తుచేస్తున్నారు. వైఎస్సార్ వరుసగా రెండు సార్లు సీఎం అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ సైతం ప్రత్యేక తెలంగాణలో రెండు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో తాను కూడా మరోసారి సీఎం అవుతానని రేవంత్ రెడ్డి బలంగా నమ్మడంతో పాటే అదే గెలుపు వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆయన అక్కడి నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనకు రాజకీయాలంటే కేవలం ఎన్నికల వరకేనని.. ఆ తర్వాత అభివృద్ధే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సైతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా తోడ్పాటు అందించాలని కోరారు. వివక్ష చూపించడం తన ఇంటా వంటా లేదని, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యే ఉన్నారని, ఒక్కసారి ప్రజలు మార్పు కోరుకుంటే.. మంచి చేసి చూపిస్తానని సీఎం సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలను కోరారు. గతంలో కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గం కొడంగల్కు ఎన్ని నిధులు ఇచ్చారు? తాను సీఎంగా ఉన్న రెండేండ్లలో సిద్ధిపేటకు ఎన్నినిధులు ఇచ్చానో లెక్కలు తీస్తే ఎవరి పనితనం ఏందో తెలుస్తుందన్నారు. ఈ విషయంపై ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలన్నారు.
CM Revanth Reddy: తెలంగాణలో ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా.. దేశంలోనే మొట్టమొదటిసారి..
కాగా,ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహించే జిల్లాలో కాంగ్రెస్ సభ నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి విసిరిన సవాల్ మీద ఇంతవరకూ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన లేదు. చోటా మోట లీడర్లు సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు, కౌంటర్లు ఇస్తున్నా.. కేసీఆర్, హరీశ్ రావు లాంటి వారు మౌనంగా ఉండిపోయారు. రేవంత్ అనుకున్న విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కాగా అమలు చేసి వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆయన సరికొత్త చరిత్రను క్రియేట్ చేయనున్నారు. హరీశ్ రావు ఓటమి పాలైతే బీఆర్ఎస్ పార్టీ భారీ దెబ్బ తగిలినట్టే అని టాక్ వినపడుతోంది. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం అసెంబ్లీకి రావడం లేదు.వచ్చే ఎన్నికల వరకు ఆయన క్రియాశీలక రాజకీయాలు చేస్తారా? దూరంగా ఉంటారా? అని అనుమానాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీశ్ రావు వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలైతే కారు పార్టీ పని అయిపోయినట్టే అని చర్చ జరుగుతున్నది.