CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల తనకున్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఉద్దేశంతో సభను వాయిదా వేసి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. “దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కోటి రూపాయల ప్రమాద బీమాను అమలు చేస్తున్నాం. సింగరేణి, విద్యుత్ శాఖల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఉద్యోగులనే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆరోగ్యం, జీవితానికి రక్షణ కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా కోటి 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలిందని, వీరందరికీ జీవిత బీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్లో ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని పొందుపరిచామని.. దీని కింద ఆరోగ్య బీమాగా రూ. 10 లక్షలు, మరణిస్తే రూ. 5 లక్షల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఇలాంటి భారీ స్థాయి బీమా సదుపాయం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ఆయన చెప్పారు.
శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ప్రాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే ఈ కార్యక్రమానికి ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చామని తెలిపారు. ఈ బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో పనిచేసే కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుందని, వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.