మున్సిపల్ ఎన్నికలను తన భుజాలపై వేసుకుని పార్టీకి ఘన విజయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.హస్తిన పెద్దలు సైతం రేవంత్ను అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే జోష్ను మున్ముందు కొనసాగించాలని సీఎంకు వారు సూచించినట్టు సమాచారం. మొన్న సర్పంచ్.. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన ముఖ్యమంత్రి.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.అందుకోసం ఇప్పటినుంచే ఆయన పకడ్బందీ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. మార్చి నెలాఖరులోపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
రెండు నెలల కిందట జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. అయితే, పార్టీ విజయంలో సీఎం రేవంత్ చొరవ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎన్నికల ముందు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి మంత్రులను నియమించి వారికి గెలుపు బాధ్యతలను అప్పగించారు. దీనికి తోడు వారి పనితీరుకు మార్కులు కేటాయిస్తామని దాని ఆధారంగానే భవిష్యత్లో జరిగే కేబినెట్ విస్తరణలో వారి ప్రాధాన్యం ఉంటుందని హెచ్చరికలు పంపారు. పనితీరు సరిగా లేకుండా మంత్రి పదవి పోతుందని చెప్పారు.దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో జిల్లా మంత్రులు పనిచేసినట్టు సమాచారం. ఫలితంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అద్భుత పనితీరును కనబరిచింది.దీంతో సీఎం రేవంత్ మంత్రులకు అప్పగించిన మున్సిపల్ టాస్క్ ఫినిష్ అయ్యింది.
స్థానిక సంస్థలకు వచ్చేనెలలోపు పూర్తిచేయకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి.ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.అనంతరం మార్చినెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం ముగించాలని ప్రభుత్వం చూస్తున్నది. అందుకోసం గ్రౌండ్ వర్క్ సైతం ప్రారంభించినట్టు సమాచారం. రేపు మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీలకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల ఎంపిక అనంతరం.. తదుపరి ఎన్నికలపై ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను మూడు నగరపాలక సంస్థలుగా విభజించారు. సైబరాబాద్,మల్కాజిగిరి, హైదరాబాద్ కార్పొరేషన్లుగా డివైడ్ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పాలక వర్గం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రులకు మరోసారి సీఎం కొత్త టాస్క్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.నగరం నుంచి ప్రస్తుతం అజారుద్దీన్ మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనపై జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఆయన ఎమ్మెల్సీగా మరో మూడు నెలల్లో ఎంపిక అవ్వకపోతే ఆయన మంత్రి పదవి సైతం పోతుందని ప్రచారం జరుగుతోంది.