Collector Hanumantha Rao: మానవత్వానికి నిలువుటద్దంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు నిలిచారు. అధికారిక బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ.. తాను దత్తత తీసుకున్న ఒక నిరుపేద విద్యార్థికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రా చారి అనే బాలుడి దీనస్థితిని చూసి గతంలో కలెక్టర్ చలించిపోయారు. ఆ బాలుడిని దత్తత తీసుకోవడమే కాకుండా.. ప్రతి నెలా చదువు కోసం 5,000 రూపాయల ఆర్థిక సాయం.. కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులను తన సొంత ఖర్చులతో అందిస్తూ వస్తున్నారు.
భరత్ కుటుంబానికి సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి 225 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేయించారు. గురువారం ఆ స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ స్వయంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక కీలకమైన విషయాన్ని భరత్ తో పంచుకున్నారు. తనకు జిల్లా నుండి బదిలీ అయిందని.. తాను వెళ్ళిపోతున్నానని చెప్పారు. అయితే బదిలీ అయినా తన బాధ్యతను విస్మరించబోనని.. భరత్ కు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.
ఇంటి నిర్మాణ పనులను నాణ్యతతో.. అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బదిలీ ఆర్డర్ చేతిలో ఉన్నా.. ఒక సామాన్యుడికి ఇచ్చిన మాట కోసం సమయం వెచ్చించి భూమి పూజకు రావడం కలెక్టర్ హనుమంత రావు నిబద్ధతకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి.. తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి.. ఎంపీడీఓ.. సబ్ ఇన్స్పెక్టర్.. పంచాయతీ సెక్రటరీ.. స్థానిక సర్పంచ్.. వార్డు సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ చేసిన ఈ పని పట్ల గ్రామస్థులు.. జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.