Manu Choudary: స్వేచ్ఛ బ్యూరో: ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకంలోని పాఠాలను బోధించడమే కాకుండా, విద్యార్థులను నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. శుక్రవారం కూకట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హిందీ పండితుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు.
విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ..
కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని విద్యార్థులకు అందించాలని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా హిందీలో మాట్లాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Also Read: పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. అలియాబాద్ మున్సిపాలిటీ కీలక నిర్ణయం!
వేదికపై ధైర్యంగా మాట్లాడేలా..
విద్యార్థుల్లో బిడియం, భయాన్ని తొలగించి, వేదికపై ధైర్యంగా మాట్లాడేలా ప్రోత్సహించాలని, స్వచ్ఛందంగా ముందుకు రాని వారికి కూడా అవకాశాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంపొందించగలిగితేనే ఉపాధ్యాయుడి బాధ్యత సార్థకమవుతుందని అన్నారు.
కలెక్టర్ హామీ..
పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు ఉంటే తన దృష్టికి లేదా జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన వొకాబులరీ, లెర్నింగ్ సాఫ్ట్వేర్ వంటి వనరులను కూడా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో కూకట్పల్లి ఎంఆర్వో అశోక్, ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Also Read: మేడ్చల్లో బైక్పై వచ్చి ఫోన్ లాకెళ్లాడు.. కట్ చేస్తే సీసీటీవీ పుణ్యమా అని!