Gundlapochampally: స్వేచ్ఛ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. స్థానికంగా ఎదురవుతున్న రవాణా ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్లో నూతనంగా ప్రతిపాదించిన రైల్వే అండర్పాస్ (ఆర్యూబీ) నిర్మాణ స్థలాన్ని శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రూట్ మ్యాప్, సాంకేతిక అంశాలపై చర్చ
పరిశీలనలో భాగంగా రైల్వే అధికారులు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన కీలక సాంకేతిక అంశాలను, రూట్ మ్యాప్ను నిశితంగా పరిశీలించారు. అండర్పాస్ నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి స్థాయి ప్రణాళికలను, నివేదికలను సిద్ధం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులకు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.
ప్రజల సౌకర్యమే మా లక్ష్యం.. విక్రమ్ రెడ్డి
ఈ కార్యక్రమం సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. గుండ్లపోచంపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ఈ రైల్వే అండర్పాస్ అందుబాటులోకి వస్తే స్థానికులకు ట్రాఫిక్ నరకం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని, ఈ అండర్పాస్ నిర్మాణ పనులను సైతం నిరంతరం పర్యవేక్షిస్తూ, వేగంగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తరలివచ్చిన నాయకులు, అధికారులు
ఈ ఉమ్మడి క్షేత్రస్థాయి పరిశీలనలో రైల్వే ఉన్నతాధికారులతో పాటు, పనుల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అలాగే బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కావేరీ శ్రీధర్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ లు హాజరయ్యారు. వీరితో పాటు బీజేపీ ముఖ్యాధికారులు, నాయకులు జైతువాలా కిషన్, మలిగే అశోక్, బట్టికడి నవనీత్, నవీన్ కుమార్, అరుణ్, నాని, శ్రవణ్ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.