Telangana : ఏదో అనుకున్నారు. ఇంకేదో అనేశారు. ముందైతే నోరు జారేశారు. ఆ తర్వాత తెలిసొస్తోంది. సీఎం రేవంత్రెడ్డి జోలికొస్తే ఎట్టాఉంటాదో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు బాగా ఎరుకైతోంది. కాంగ్రెస్ శ్రేణులు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. నోటికి నోరు.. తిట్టుకు తిట్టుతో బదులిస్తున్నాయి. ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయింది ఈటల పరిస్థితి అంటున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఈటల రాజేందర్.. బీజేపీ అధ్యక్ష పదవి కోసమే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఆయన్ను ఇలానే వదిలేస్తే.. ముందుముందు మిగతా నేతలు సైతం నోరు జారే ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ దళం.. ఈటలపై పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తోంది. ఏకంగా ఆయన ఇంటినే ముట్టడించింది.
జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
ఈటల కామెంట్లపై కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ జగ్గారెడ్డి తనదైన స్టైల్లోమాస్ దమ్కీ ఇచ్చారు. ఆయన మాట్లాడిన భాషలోనే బదులిచ్చారు. బట్టలిప్పిచ్చి కొడతా అంటూ జగ్గారెడ్డి భగ్గు మన్నారు. వారిద్దరి తిట్ల దండకం.. తెలంగాణలో రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ శ్రేణులు ఈటల ఇంటిపై అటాక్ చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటిముందు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
ఈటల తగ్గేదేలే..
అయినా, ఈటల రాజేందర్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. హైడ్రాపై అనేక సార్లు ముఖ్యమంత్రికి వివరించినా.. వినడం లేదన్నారు. సీఎం అనేవారు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని.. ప్రజలను కష్టపెట్టొద్దన్నారు. జగ్గారెడ్డి చిల్లర గాడు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని.. పదవుల కోసం కుక్కల్లాగా మొరుగుతున్నారని మండిపడ్డారు ఈటల. తాను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయలేదని.. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పారు.
ఆనాటి గొడవ.. ఈనాటికీ..?
ఈటల వర్సెస్ రేవంత్. ఎన్నికలకు ముందు ఓ రేంజ్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ నుంచి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డబ్బులు తీసుకున్నాడంటూ అసంబద్ధ ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. అంతే. రేవంత్కు కోపం నషాళానికి అంటింది. ఏం మాట్లాడుతున్నావ్ రాజేందర్? అంటూ.. చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దాం రా అంటూ సవాల్ చేశాడు. చెప్పినట్టుగానే ప్రమాణం చేసి చూపించారు రేవంత్. ఈటల మాత్రం రాకుండా తప్పించుకున్నారు. ఆ సమయంలో రేవంత్రెడ్డి.. ఈటల రాజేందర్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అది మనుసులో పెట్టుకున్నారో ఏమో.. ఈటల తరుచూ రేవంత్రెడ్డిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇటీవల హద్దు మీరి మరీ దారుణమైన భాష వాడుతూ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈటల అలా అనేసరికి కాంగ్రెస్ కేడర్ సైతం అదే రేంజ్లో కౌంటర్ అటాక్ చేస్తోంది.
ఈటల అందుకే అలా..
లేటెస్ట్గా, ఎంపీ ఈటల రాజేందర్కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదన్న ఆక్రోశంలో ఈటల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈటల మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. హైడ్రా గురించి మాట్లాడే ఈటల.. దేవాదాయశాఖ భూములను కబ్జా చేశారని ఆయనపై కేసు ఉన్న విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తప్పులు ఎత్తి చూపుతూ.. సద్విమర్శలు చేయొచ్చు కానీ.. స్వార్థంతో నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ అన్నారు.
Also Read : కవితకు పొగ పెడుతున్నది ఎవరు?