Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి వికటిస్తే ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తాయో ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది.
అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేశ్.. ప్రచార సమయంలో ఓటర్లకు నగదుతో పాటు కుక్కర్లను పంపిణీ చేశారు. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత అంచనాలు తలకిందులయ్యాయని భావించిన ఆయన నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి రచ్చ చేశారు. తనకు ఓటు వేయలేదన్న అనుమానంతో.. తాను పంపిణీ చేసిన డబ్బును, కుక్కర్లను తక్షణమే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఓటర్లతో వాగ్వాదానికి దిగారు.
అభ్యర్థి రమేష్ తీరుతో అవమానానికి గురైన 10వ వార్డు మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని మేమేమీ అడగలేదు.. మీరే వచ్చి ఇచ్చి, ఇప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానిస్తారా?’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థి ఇచ్చిన కుక్కర్లను రోడ్డుపై పడేసి తమ నిరసనను తెలియజేశారు. ఒక అభ్యర్థి గెలుపోటముల కంటే ముందే ఓటర్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు.
ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేయడమే చట్టరీత్యా నేరం కాగా.. పంపిణీ చేసిన వస్తువులను వెనక్కి తీసుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అభ్యర్థి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:గర్భస్రావానికి ఒత్తిడి.. మనస్తాపంతో గర్భిణీ ఆత్మహత్యాయత్నం
మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేష్
డబ్బులు, కుక్కర్లు… pic.twitter.com/A4MmjDu6pI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2026