CM Chandrababu Naidu: కూటమి ఐక్యత, అభివృద్ధి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాధ్యతలు, జిల్లాల వారీగా ఉమ్మడి సమన్వయంపై టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కూటమి ఐక్యతను కాపాడుకోవాలని, వచ్చే 15 ఏళ్లపాటు ఈ కూటమి బలంగా ఉండాలనే ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విషయ అవగాహనతో రావాలని, చర్చలకు ప్రిపేర్ అయి మాట్లాడాలని, సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో ‘ఆవు కథలు’ చెప్పవద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు ఎన్టీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి అందరికీ మార్గనిర్దేశం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ముగిసిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. దీనికి పవన్ కల్యాణ్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావకను అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోంది, కింద స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలని, జిల్లాల స్థాయిలో మూడు పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మాట్లాడతానని, పనితీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న 40 మందిని వ్యక్తిగతంగా పిలిపించుకుని చర్చిస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతిఒక్కరు ఉండాలని, ఎమ్మెల్యేలు అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిముషాల్లో మాట్లాడాలని దిశానిర్ధేశం చేశారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్డ్ ప్రిపేర్ అయి సభకు రావలని గైడ్ చేశారు. అన్ని మతాలను గౌరవించాలని, భక్తుల సెంటిమెంట్ను దెబ్బ తీయకూడదన్నారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్ధం సహా అనే ఆలయాలపై దాడులు జరిగాయని విమర్శించారు. శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని మండిపడ్డారు.
Also Read: Peddi: రామ్ చరణ్ పెద్ది కోసం పెద్ద స్కెచ్.. అందుకే అతని రంగంలోకి..!
ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో.. దీర్ఘ కాలం అదే స్ఫూర్తితో పనిచేయాలని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం పిలుపునిచ్చారు. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం సహకారమే కారణమన్నారు. కేంద్ర సహాయంతోనే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాగలిగామన్నారు. అమరావతి, పోలవరానికి కేంద్ర నిధులు రాకపోయిఉంటే.. నేడు ఈ ప్రాజెక్టుల ప్రారంభం అయ్యేవి కావని, కేంద్రం చేయూతతోనే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.
మొన్నటి ఎన్నికల కంటే ఇప్పటికి కూటమి బలం పెరిగిందని, సంక్షేమ, అభివృద్ధితో 20 నెలల్లో మన బలం, ప్రజల మద్దతు మరింత పెరిగిందని, దాన్ని మీరంతా సానుకూలంగా తీసుకుని, మరింత కష్టపడి పనిచేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. చేసిన పనులకు ఎమ్మెల్యేలు ఓనర్షిప్ తీసుకోవాలని, కేంద్రం చేసినా, రాష్ట్రం చేసినా ఓనర్షిప్ తీసుకోవాలని, రెండు ప్రభుత్వాలు వేర్వేరు కాదు..మనవే అని ఉద్ఘాటించారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో 90 శాతం మంది వైసీపీ ప్రభుత్వ బాధితులే అని, ఇప్పుడు నీతులు వల్లె వేస్తున్న వైసీపీ నేతలు.. నాడు పవన్ విశాఖ వెళితే కనీసం కారు దిగనివ్వలేదని.. హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదని, తనను కూడా ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానివ్వలేదని చంద్రబాబు గుర్తు చేశారు. తన అరెస్టు సమయంలో పవన్ హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే ఆయనకు అనేక అడ్డంకులు సృష్టించారని, ఫ్లైట్ క్యాన్సిల్ చేయించారని, ఇలాంటి అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదిరించి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచామన్నారు. అదే స్ఫూర్తి, పట్టుదలలతో ఎమ్మెల్యేలంతా కూటమి ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు.
Also Read: TG Congress MPs: కాంగ్రెస్లో గప్ చుప్ క్రికెట్ టీమ్.. ఈ మౌనం దేనికి సంకేతం..?
ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించాం.. ప్రగతి వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నామని పేర్కొన్నారు. వైసీపీ.. హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని పవన్ ఆరోపించారు. వైసీపీ నేతలు చేసే విధ్వంస కుట్రలను సమావేశంలో డిప్యూటీ సీఎం లేవనెత్తారు. మన ప్రభుత్వంపై జగన్ అండ్ కో చేసే కుట్రలపై మూడు పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పవన్ ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు.
ఏపీ అసెంబ్లీలో సభ్యులు ఎంతసేపు మాట్లాడామనే దానికంటే గురించి ఏం మాట్లాడమనేది ముఖ్యమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారని ప్రస్తావించారు. ఆయన కలిసే ప్రతీ సంస్థ గురించి ముందస్తు సమాచారం సేకరించి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడేవారని గుర్తుచేశారు. దావోస్ పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో జరిగిన భేటీల్లో ఆ సంస్థకు మన ప్రభుత్వ పరంగా కావాల్సినవి ఏమిటి? మనకు ఉన్న వనరులేమిటనే విషయంపై సూటిగా చెప్పి.. ప్రతి సమావేశాన్ని నిమిషాల వ్యవధిలో చంద్రబాబు ముగించారన్నారు.
దీంతో తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కలిసేందుకు వీలైందని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో సభ్యులు కూడా ముఖ్యమంత్రి స్పూర్తితో.. తక్కువ సమయంలో కీలక అంశాల గురించి ప్రస్తావించాలని మంత్రి పయ్యావుల కేశవ్ మార్గనిర్దేశం చేశారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మూడు పార్టీల ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలు క్లాస్ తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది.
Story by: Apparao, Big Tv