Telangana : ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇన్నాళ్లూ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత. గురుకులాల బాస్గా బాగా ప్రాచుర్యం పొందారు. స్వారోస్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బీఎస్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్లో చేరినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆయనేంటి కారు ఎక్కడమేంటని అవాక్కయ్యారు. గులాబీ కండువ వేసుకొని దూకుడు రాజకీయాలే చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. అయితే, ఆర్ఎస్పీ కూడా సుద్దపూస ఏం కాదంటోంది కాంగ్రెస్. కాగ్ లెక్కలు చూపిస్తూ.. ప్రవీణ్ అవినీతిని బయటపెట్టింది.
కోడింగ్లో కిరికిరి..
గురుకులాల చీఫ్గా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాగానే అక్రమాలకు పాల్పడినట్టు.. కేంద్ర కాగ్ నివేదికలోని అంశాలను వెల్లడించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్రెడ్డి. స్కూల్ పిల్లలకు కోడింగ్ నేర్పించడానికి ఏడాదికి రూ.4 కోట్లు ఖర్చు చేశారట. 240 మంది పిల్లలకు కోడింగ్ కోచింగ్ ఇప్పిస్తే.. 4 కోట్లు అవుతాయా అంటూ ప్రశ్నించారు సామ. మూడు సంస్థల పేరుతో కోడింగ్ నేర్పిస్తామని.. రెండు సంస్థలకు అనుమతి తీసుకున్నారని చెప్పారు. ఈ-టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదని.. ఆర్ధిక శాఖ అనుమతి కూడా లేదని కాగ్ తెలిపింది. అంబేద్కర్ పేరు చెప్పి.. దళిత విద్యార్థుల పేరుతో లూటీ చేశారని.. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సామ రామ్మోహన్రెడ్డి.
కోచింగ్లోనూ పైసా వసూల్
కోడింగ్ ఒక్కటే కాదు. ఐఐటీ జేఈఈ ఆన్లైన్ కోర్సులంటూ రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని కాగ్ అంటోంది. దానికి కూడా టెండర్ లేదు.. ఆర్ధికశాఖ అనుమతి లేదు. అదంతా అవినీతి కాక మరేంటని ప్రశ్నించారు సామ. యూనిఫాం, దుప్పట్లు కూడా వదలకుండా rs ప్రవీణ్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. సమ్మర్ క్యాంప్ల పేరిట కూడా నిధులు పక్కదారి పట్టించారని కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేశారు. 11 ఏండ్లలో ఎస్సీ గురుకులాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ లేదని.. కానీ ఇప్పుడు మాత్రం అన్ని సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు.
దళిత పిల్లల పేర్ల మీద వారికి అందాల్సిన సంక్షేమ పథకాల్లో దోపిడీకి పాల్పడ్డారని.. అంబేద్కర్ పేరు చెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్నారు సామా రామ్మోహన్ రెడ్డి. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.