Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ సీరియస్ గా వ్యవహరించనున్నది. గత సర్పంచ్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ లైన్ దాటే నాయకులపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రెబల్స్ గా నామినేషన్లు వేసినోళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దల నుంచి డీసీసీలకు ఆదేశాలు వెళ్లాయి.కాంగ్రెస్ పార్టీలో ఇంత కాలం పనిచేసి, రిజైన్ చేయకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా పార్టీకి వివరణ ఇవ్వాల్సిందే.
రెబల్స్ విషయంలో సీఎం కూడా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్స్ కట్టడి కోసం పార్టీ ముందుగానే అలర్ట్ అయింది. సాధారణంగా ఎన్నికల తర్వాత రెబల్స్పై చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసినా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినా తక్షణమే వివరణ కోరాలని, సంతృప్తికరమైన సమాధానం లేని పక్షంలో పార్టీ నుంచి బహిష్కరించాలని ముందే జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు వెళ్లడం గమనార్హం.మున్సిపల్ ఎన్నికలను సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేత, ఎంపీ మల్లు రవికి అప్పగించారు. ఆయన నేతృత్వంలోని మానిటరింగ్ కమిటీ ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను గమనిస్తోంది.మున్సిపాలిటీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారు రెబల్స్గా మారకుండా బుజ్జగింపులు చేస్తూనే ఉన్నారు.
వాస్తవానికి సర్పంచ్ ఎన్నికల్లో సొంత పార్టీ నేతల్లో చీలికలు వలనే కొన్ని పంచాయితీలు కోల్పోయామని కాంగ్రెస్ భావిస్తున్నది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బలంగా ఉన్నప్పటికీ, అంతర్గత కుమ్ములాటల వల్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచి పార్టీకి నష్టం చేకూర్చారు.పైగా క్షేత్రస్థాయిలో విపక్షాల కంటే సొంత పార్టీ రెబల్స్ నుంచే పోటీ ఎక్కువగా ఉంటుందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే రెబల్స్ కు హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలో ఉన్న పార్టీగా మున్సిపాలిటీల్లో మెజార్టీ సీట్లు గెలవడం ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజల నమ్మకాన్ని చాటిచెప్పాలని సీఎం భావిస్తున్నారు.దీంతోనే రెబల్స్ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా ప్రెసిడెంట్ తమ పరిధిలోని మండలాల వారీగా అసమ్మతి నేతల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతుంటే, వారిని కూర్చోబెట్టి ఏకాభిప్రాయం తీసుకురావడం, లేని పక్షంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండేలా హామీ తీసుకోవడం ఇప్పుడు డీసీసీల ముందున్న ప్రధాన సవాలు.లేని పక్షంలో డిసిప్లినరీ కమిటీకి ఆయా అభ్యర్ధుల పేర్లను డీసీసీలు పంపనున్నారు. సీఎం ఆదేశాలతో మానిటరింగ్ కమిటీల నిఘాతో రెబల్స్ గొంతు నొక్కేసి, విజయ కేతనం ఎగురవేయాలని ‘హస్తం’ పార్టీ వ్యూహరచన చేయడం విశేషం.