Counter to KTR : తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపు ఇవ్వడం సహా.. అనేక అంశాల్లో సీఎం రేవంత్ దుకుడుకు విపక్ష పార్టీ నేతలు ఖంగుతింటున్నారు. రాష్ట్రంలో విమర్శలు చేసినా, వ్యతిరేక ప్రచారాన్ని ఊదరగొడుతున్నా.. వెనక్కితగ్గకపోవడంతో మరో ఎత్తుకు సిద్ధమయ్యారు. సీఎం తీరుపై విమర్శలు చేస్తూ.. ఏకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు కేటీఆర్. దీంతో.. రాష్ట్రంలో రాజకీయ క్షేత్రం మరోమారు వేడెక్కింది. తన నాయకుడిపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో తమ అగ్రనేతకు తెలుసు.. ప్రజలకు తెలుసు అంటూ తోడుగా నిలుస్తున్నారు.. మిగతా కాంగ్రెస్ నేతలు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటిటా నిర్బంధమా, సకల రంగాల్లో సంక్షోభమా అంటూ కేటీఆర్ రాహుల్ కి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పార్టీ విధానాలు, చేసిన వాగ్ధానాలపై నమ్మకంతో అధికారం అందిస్తే.. రాష్ట్రాన్ని ఆగం చేయడమే కాకుండా, అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా అంటూ లేఖలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విమర్శలకు అంతూపొంతు లేని కేటీఆర్.. మీ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ ఏడాది పాలనలోని అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బహిరంగంగా సవాళు విసురుతున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిదిద్ధుతున్న కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజా మద్ధతు ఉందంటూ తేల్చిచెబుతున్నారు.
ముందు నీ ఇంట్లో పంచాయితీ సంగతి చూడు కేటీఆర్..
పదేళ్ల కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని.. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని క్షేమంగా బయటకు తీసుకురావడంతో పాటు ప్రతీనెల ఒకటో తారీఖున జీతాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఏడాది పాలనలోనే అనేక విజయాలు సాధించామని, బీఆర్ఎస్ తొమ్మిదేళ్లు సాధించలేనిది.. కాంగ్రెస్ ఏడాదిలోనే అనేక అంశాల్లో మెరుగ్గా పనిచేస్తోందని కితాబిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తేందుకు శాయశక్తులా పనిచేస్తున్న తన నాయకత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి.. విమర్శిస్తున్నారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తమను చూసి, ఓర్వలేక ప్రతి రోజు విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకే రావడం లేదని.. అలాంటి పార్టీ నేతలు ప్రజలు, పాలన గురించి తమకు నీతులు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫాం హౌస్ కు పరిమితమైతే.. కేటీఆర్, హారీష్ రావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు తమ అగ్రనాయకత్వానికి తెలుసని, ప్రత్యేకంగా కేటీఆర్ తప్పుడు లేఖ రాయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా అమలు చేస్తున్నామని తెలిపిన చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ముందు ఇంట్లో ఉన్న పంచాయితీలు తేల్చుకోండి అంటూ కేటీఆర్ కు చురకలు అంటించారు.
రాష్ట్రాన్ని నాశనం చేశారు
తెలంగాణ తల్లిపై రాజకీయాలు చేసి పదవులు అనుభవించిన కేసీఆర్ కుటుంబం.. ఆ తల్లికి సరైన గౌరవం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టాలనే ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్ డబ్బులిచ్చి పెట్టించుకున్న ఆస్థాన పేటీఏం రైటర్లు రాసిన లేఖను రాహుల్కు పంపించారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. అవన్నీ పిచ్చి రాతలని, కేటీఆర్కు తమ ప్రభుత్వంపై ఎందుకంత కడుపు మంటో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలోని మహిళల్ని ఎంతో అద్భుతంగా చూసుకుంటున్నామన్న ఆది శ్రీనివాస్.. ఈ పథకాలను చూసే కేటీఆర్ అసూయ పడుతున్నారని, తెలంగాణ తల్లిపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత పదేండ్ల పరిపాలనలో రాష్ట్రానికి మంచి చేసే ఏ అంశంలోనూ కేసీఆర్ ప్రభుత్వం పాలసీ విధానాల్ని రూపొందించలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూ, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా.. ప్రతీ రంగాన్ని మరింత మెరుగుదిద్దేలా పాలసీలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.