Anil Kumar Yadav: రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న హైదరాబాద్లోని గాంధీ భవన్లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నిరుద్యోగులకు సువర్ణావకాశం
ఈ నెల 19న జరిగే మెగా జాబ్ మేళాకు సుమారు 100 ప్రముఖ కంపెనీలు తరలివస్తున్నాయని అనిల్ యాదవ్ తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించాలనుకునే నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మాటలకే పరిమితం కాకుండా, వివిధ రంగాల్లో దాదాపు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.
Also Read: బిఆర్ఎస్ ఓట్లు లేపేయడమే కాంగ్రెస్, బిజేపి టార్గెట్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం!
మోడీపై విమర్శల జడివాన
దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని అనిల్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల కోసం, విద్యా వ్యవస్థ రక్షణ కోసం యువ నాయకుడు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికిన ప్రధాని మోడీ, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోడీ, దేశానికి ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు లాంటి కాంగ్రెస్ మహానుభావులు చేసిన అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి, మోడీ భజన చేసుకోవడమే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పనిగా మారిందని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శలపై స్పందిస్తూ.. కేటీఆర్ కుటుంబంలో ఉన్నవారంతా వెన్నుపోటు దారులేనని అనిల్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారో, పొడుస్తున్నారో ప్రజలందరికీ బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.
Also Read: తెలంగాణలో మారిన వాతావరణం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు!
రాహుల్ గాంధీ పుట్టినరోజున మెగా జాబ్ మేళా
జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా 100కు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలోనే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించిందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.… pic.twitter.com/ImFrYQKsFd
— BIG TV Breaking News (@bigtvtelugu) June 14, 2026