రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు అంగరంగం వైభవంగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు తమ తమ జిల్లాల్లో భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు.తమ కేడర్తో ముచ్చటిస్తూ పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమ కేడర్, ముఖ్యనాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా వారికి పండుగ శుభాకాంక్షలు చెబుతూనే అసలు విషయంలోకి వెళ్తున్నారు. కేడర్, కీలక నేతలు కూడా విషెస్ చెప్పడానికి వచ్చినట్టే వచ్చి వచ్చే ఎన్నికల్లో ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం అధికార పార్టీలో ఓ విషయంపై జోరుగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.సర్పంచ్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన కొందరు రెబల్గా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అందులో కొందరికి లక్కీ చాన్స్ తలుపుతట్టగా మరికొందరు ఓటమిపాలయ్యారు. అయితే, గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన కొందరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో చాన్స్ ఇస్తామని బడా లీడర్లు హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం వారంతా తమకు అవకాశం ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది.ఈ నేపథ్యంలో వారికి ఎలా హామీ ఇవ్వాలో తెలీక మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీనికి తోడు ఈసారి సైతం టికెట్ రాకపోతే పలువురు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
మున్సిపల్ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తున్నది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆ రెండు పార్టీల గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించినట్టు సమాచారం. గత సర్పంచ్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ సారైనా ఎన్నికల్లో సత్తా చాటి అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలని ప్రతిపక్షాలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. అధికార పార్టీలో టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వారిని, ఆర్థికంగా బలంగా ఉండి.. గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించి అదే స్థానంలో నిలపాలని అటు గులాబీ, ఇటు కాషాయ పార్టీ స్కెచ్ వేసినట్టు సమాచారం.
YSRCP : బోగీ మంటల సాక్షిగా విషం కక్కుతున్న వైసీపీ!..బాబు ఏం చేయలేదా?
మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పండుగ జోష్లో మునిగిపోయాయి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీకి చెక్ పెట్టాలని అధికార పార్టీ భారీ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొత్తగా ప్రచారం సైతం మొదలెట్టినట్టు తెలుస్తున్నది. భోగి మంటల్లో ‘నిక్కర్.. లిక్కర్’ పార్టీలను వేస్తే ఓ పనిఅయిపోతుందని కార్టూన్ క్రియేట్ చేసి నెట్టింట జోరుగా ప్రచారం చేస్తున్నారు.దీనిపై అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం పెదవి విరుస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.