బీఆర్ఎస్ రజతోత్సవ వేళ ఆ పార్టీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రజతోత్సవానికి గులాబిదళం హడావిడి చేస్తుంది కానీ, కార్యకర్తల్లో పెద్దగా స్పందన లేదని, కనీసం స్థానిక నేతలు కూడా ఆ సభ విషయంలో ఉత్సాహంగా లేరని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు పార్టీ పెట్టినప్పుడు ఉన్నవాళ్లెవరూ ఇప్పుడు కేసీఆర్ వెంట లేరు కదా అని లాజిక్ తీస్తున్నారు. మధ్యలో వచ్చినవాళ్లు, అవకాశవాదులతో ఉన్న ఆ పార్టీకి అసలు రజతోత్సవాలు ఎందుకంటూ వెటకారం చేస్తున్నారు.
రజతోత్సవం టీఆర్ఎస్ కా, బీఆర్ఎస్ కా..?
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీ పెట్టి, భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి రజతోత్సవాలు ఎలా చేస్తారంటూ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ పార్టీ తెలంగాణ గొంతుక కాదని, గొంతు కోసిన పార్టీ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ అర్జెంట్గా సీఎం ఎందుకు కావాలో కేటీఆర్ వివరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను వద్దని ప్రజలు ఇంటికి పంపించారని.. ఎన్నికల వరకు ఆగలేని కేటీఆర్ అర్జంట్ గా అధికారం కావాలని కోరుకోవడం హాస్యాస్పదం అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలా? అని ప్రశ్నించారు.
రజతోత్సవాలు టీఆర్ఎస్ పార్టీకి నిర్వహిస్తున్నారా? @BRSparty కి నిర్వహిస్తున్నారా @KTRBRS? ఈ విషయం తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి అయితే రెండు మూడేండ్ల కిందనే ఆ పార్టీ పేరు మార్చి టీఆర్ఎస్ ను బొంద పెట్టిండ్రు. మరి బీఆర్ఎస్ పుట్టి రెండు… pic.twitter.com/CESx89yq08
— Kiran Kumar Chamala (@kiran_chamala) April 21, 2025
ఎవరున్నారు..?
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజున ఉన్న కీలక నేతలు ఇప్పడు కేసీఆర్ వెంట ఎందుకు లేరని ప్రశ్నించారు ఎంపీ చామల. ఆ విషయాన్ని ఓసారి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నారని.. ఇప్పుడు పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహా ఎవరు మిగిలారని ప్రశ్నించారు. తుపాకీ రాముడు, రబ్బర్ చెప్పుల హరీష్, లిక్కర్ కవిత, హ్యాపీ రావు తప్ప బీఆర్ఎస్ లో ఎవరున్నారని కౌంటర్లిచ్చారు. తెలంగాణ కోసం పార్టీలో చేరినవారెవరూ ఇప్పుడు అక్కడ లేరని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడినవాళ్లు.. అసలు విషయం తెలుసుకుని కేసీఆర్ కి దూరం జరిగారన్నారు. ఒకరకంగా వారందర్నీ కేసీఆరే బయటకు పంపించారని చెప్పారు.
దళితుడిని తెలంగాణకు తొలి సీఎంని చేస్తానని కేసీఆర్ మోసం చేశారని, మూడు ఎకరాలు భూమి ఇస్తానని మోసం చేశారని, కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల సొమ్ము దోచుకున్నారని.. అలాంటి వ్యక్తిని తిరిగి సీఎం ఎందుకు చేయాలన్నారు ఎంపీ చామల. కేసీఆర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే తెలంగాణ అప్పుల పాలెందుకైందని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
బీసీ అధ్యక్షుడు..?
కాంగ్రెస్ చేసిన కులగణన వల్ల బీఆర్ఎస్ పార్టీలో వణుకు మొదలైందని, రజతోత్సవ సభలో ఆ పార్టీకి బీసీ నాయకుడిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారని తమకు సమాచారం ఉందని, అదే నిజమైతే తాము ఆ పరిణామాన్ని ఆహ్వానిస్తామని చెప్పారు ఎంపీ చామల. 9 ఏళ్లపాటు తెలంగాణ ప్రజల్ని దోచుకున్నందుకు, అభివృద్ధి పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.