Paddy Damage: దౌల్తాబాద్ మండలంలో వరి రైతులను కలవరపరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. కలుపు నివారణ కోసం గడ్డి మందు పిచికారీ చేసిన అనంతరం సుమారు 8 ఎకరాల వరి పంట పూర్తిగా కూలిపోయిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మండలంలోని మాచిన్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు, ఇందుప్రియాల్కు చెందిన ఒక రైతు, మహ్మద్షాపూర్కు చెందిన మరో రైతు పొలాల్లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
బాధిత రైతుల కథనం ప్రకారం కలుపు నివారణ కోసం బీఎస్హెచ్ అగ్రిటెక్ కంపెనీకి చెందిన ‘చెస్’ అనే గడ్డి మందును వాడారు. మందు పిచికారీ చేసిన మూడు రోజులకే వరి మొక్కలు పసుపు రంగులోకి మారి, అనంతరం క్రమంగా కుళ్లిపోయి నేలకూలిపోయాయని వారు వాపోయారు. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఒక్కసారిగా దెబ్బతినడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దెబ్బతినడానికి కారణాలపై వివరణ కోరేందుకు రైతులు ఇందుప్రియాల్లోని శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రానికి వెళ్లగా అప్పటికే దుకాణం మూసివేసి ఉండటంతో పాటు యజమాని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు.
Also Read: అప్పుడు ఏపీకి మద్దతిచ్చి.. ఇప్పుడు మొసలి కన్నీరా.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్!
దీంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి బాధిత పొలాలను పరిశీలించాలని, గడ్డి మందు నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గడ్డి మందు నాణ్యతలో లోపం వల్లే పంట నష్టం జరిగిందని తేలితే సంబంధిత కంపెనీ, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని కోరుతున్నారు. పంట నష్టంతో అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల విచారణతోనే వాస్తవాలు వెల్లడి రైతులు గడ్డి మందు వల్లే పంట పూర్తిగా కూలిపోయిందని ఆరోపిస్తున్నప్పటికీ, దీనిపై వ్యవసాయ శాఖ లేదా సంబంధిత సంస్థల నుంచి అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. శాస్త్రీయ పరీక్షలు, అధికారుల విచారణ అనంతరమే పంట నష్టానికి అసలు కారణం ఏమిటన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.
Also Read: ఇకపై పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ అన్నింటికీ ఒకే నంబర్.. ఏంటో తెలుసా..!