Reforms to Banks: టెక్నాలజీ పరంగా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ప్రతీ విభాగాన్ని డిజిటల్ చేసే విషయంపై ఫోకస్ చేసింది. తొలుత బ్యాంకుల నుంచి మొదలుపెట్టాలని ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున హెచ్ఆర్ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు డిజిటల్ రూపంలోకి మారబోతున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కీలక సంస్కరణలకు శ్రీకారం
కేంద్ర ఆర్థికశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు అడుగులు వేస్తోంది. పారదర్శకతను పెంచేందుకు డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తోంది. ఉద్యోగుల సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, బదిలీల విషయంలో ఆటోమేటెడ్ విధానాన్ని డిజిటల్ రూపంలో తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు జాతీయ బిజినెస్ ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం 7.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అంతా డిజిటల్ మయం.. ఉద్యోగులకు ఇక పండగే
ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జాప్యాలు, హెచ్ఆర్ పద్ధతులపై విమర్శలు వినిపిస్తున్న వేళ కీలక సంస్కరణల వైపు ఆర్థికశాఖ అడుగులు వేసినట్టు అందులోని సారాంశం. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా ఉంది.
ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ పోర్టల్స్ ద్వారా ఆటోమేట్ చేయాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం-DFS బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. ప్రతి ఏటా జనవరి నుంచి ఫిబ్రవరి ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించి మార్చి చివరినాటికి పూర్తి చేయనుంది. జూన్ నెల కంటే ముందే వార్షిక బదిలీల ప్రక్రియను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. పేక మేడలా కూలిన ఐటీ షేర్లు, కేవలం ఫార్మా రంగం తప్పితే
బదిలీలు, పదోన్నతుల తర్వాత సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ శిక్షణను బలోపేతం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యంగా చెబుతున్నారు. శిక్షణా కార్యక్రమాలలో బ్యాంకుల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, టాప్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపట్టాలని ఆలోచన చేస్తోందట.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత సహకరించుకునే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేయనుందని తెలుస్తోంది. ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రభుత్వ రంగ బ్యాంకు రంగంలో సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లు అవుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.