Telangana Police: రాష్ట్ర ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, సమన్వయంతో కూడిన సహాయాన్ని అందించడానికి పోలీసు శాఖ డయల్ 112ను అందుబాటులోకి తెచ్చింది. బంజారాహిల్స్ లోని ఐసీసీసీలో డీజీపీ సీ.వీ.ఆనంద్ బుధవారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక ఆధారిత పోలీసింగ్ పౌర కేంద్రిత అత్యవసర సేవల దిశగా తెలంగాణ వేస్తున్న అడుగుల్లో ఈ డయల్ 112 ప్లాట్ఫామ్ ఒక ప్రధాన మైలురాయి అని చెప్పారు. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్ 112 మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. ప్రతి కాల్ పై స్పందించి చర్యలు తీసుకుంటామన్న దానినిబట్టి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.
పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ సేవలను 112 అనే ఒకే జాతీయ నంబర్కు అనుసంధానించినట్టు తెలిపారు. ఏఐ ఆధారిత కాల్ ఫిల్టరింగ్ దీని ప్రత్యేకత అని చెప్పారు. అనవసరమైన, స్పామ్, సైలెంట్, చైల్డ్ కాల్స్ను ప్రాథమిక స్థాయిలోనే ఫిల్టర్ చేసి అసలైన అత్యవసర కాల్స్కు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కాల్ ద్వారా అందే ఫిర్యాదునుబట్టి స్వభావాన్ని సంబంధిత రెస్పాన్స్ టీమ్కు ఏఐ సాంకేతికత ద్వారా మళ్లిస్తుందని వివరించారు. మాట్లాడే సంభాషణను ఆటోమేటిక్గా టెక్స్ట్ రూపంలోకి మారుస్తుందన్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా కాలర్ల లొకేషన్ ను ఖచ్చితంగా గుర్తించవచ్చన్నారు.
భవిష్యత్తులో రాబోయే పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్లను “ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా” ఉపయోగించనున్నట్టు చెప్పారు. సాంకేతిక మార్పుల వల్ల కాల్ ప్రాసెసింగ్ సమయం 100 సెకన్ల నుండి 69 సెకన్లకు తగ్గిందని చెప్పారు. డిస్పాచ్ సమయం 90 సెకన్ల నుండి 64 సెకన్లకు తగ్గిందన్నారు. మొత్తం కాల్ సెంటర్ ప్రాసెసింగ్ సమయం 190 సెకన్ల నుండి 133 సెకన్లకు తగ్గిందని వివరించారు.
Also Read: దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!
ప్రస్తుత రెస్పాన్స్ సమయం పట్టణ ప్రాంతాల్లో 6 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో, 15 నిమిషాలు, రాష్ట్ర సగటు10 నిమిషాల 30 సెకన్లుగా ఉన్నట్టు చెప్పారు. జాతీయ సగటు 18 నిమిషాల కంటే ఇది అత్యుత్తమమైనదన్నారు.
ఐసీసీసీలోని రెండు అంతస్తుల్లో పని చెయ్యనున్న డయల్ 112 సెంటర్ 24×7 ప్రాతిపదికన 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది, 900 SIP ఆధారిత ఛానళ్లతో పనిచేస్తుంది. రోజువారీగా దాదాపు 14 లక్షల కాల్స్ ఐవీఆర్ ను చేరుతుండగా 18వేల ఎమర్జెన్సీ కాల్స్ ను సిబ్బంది స్వీకరిస్తున్నారు. రోజుకు సుమారు 7,500 సంఘటనలకు ఫీల్డ్ యూనిట్లను పంపుతున్నారు. రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్ల పరిధిలో ఉన్న 1,860 పెట్రోలింగ్ వాహనాలను (788 నాలుగు చక్రాల వాహనాలు, 1,072 ద్విచక్ర వాహనాలు) డిజిటల్గా అనుసంధానించారు. సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని సిస్టమ్ ఆటోమేటిక్గా గుర్తించి పంపుతుంది.
కొంపల్లిలోని జీవీకే ఈఎంఆర్ఐ నుంచి డయల్ 100 సేవలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐసీసీసీలోని 112కు బదిలీ చేశారు. పాత పీఆర్ఐ టెక్నాలజీ స్థానంలో ఆధునిక ఎస్ఐపీ ఆర్కిటెక్చర్ ను ప్రవేశ పెట్టారు. మాన్యువల్ డిస్పాచ్ స్థానంలో ఏఐ ఆధారిత డిస్పాచ్ ను అమల్లోకి తెచ్చారు. మల్టిపుల్ స్క్రీన్ల స్థానంలో ఏకీకృత సింగిల్-విండో ఇంటర్ఫేస్ ను అందుబాటులోకి తెచ్చారు. సిస్టమ్ ఫీచర్లను 118 నుండి 236 ఇంటెలిజెంట్ ఫీచర్స్ కు పెంచారు. ప్రజలందరూ పోలీసు, ఫైర్, అంబులెన్స్ ఇతర సేవలకు ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112 ను గుర్తుంచుకోవాలని డీజీపీ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఏఐ వేదిక పనిచేసే తీరు, లొకేషన్ గుర్తింపు, వాహనాల కేటాయింపు, లైవ్ డాష్ బోర్డుల పనితీరుపై డెమో ప్రదర్శించారు. కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, డీజీ శ్రీనివాసరావు, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్, మల్కాజిగిరి సీపీ సుమతి, ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ డీజీ చారూ సిన్హా, ఐజీ గజరావ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: అప్పుడు ఏపీకి మద్దతిచ్చి.. ఇప్పుడు మొసలి కన్నీరా.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్!