రాష్ట్రంలో ఎన్నికలు లేకపోయినా పొలిటికల్ పార్టీల నడుమ రాజకీయం హీటెక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వరుసగా బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.ముందుగా బీజేపీ సభ జరగనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ సభ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ప్రధాని మోడీ ఈనెలలో తెలంగాణకు రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇటీవల ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగా.. ఎన్డీయే కూటమి మూడు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది. బెంగాల్ టార్గెట్ ఫినిష్ కావడంతో ఇప్పుడు తెలంగాణ మీద కమలం పెద్దలు గురిపెట్టినట్టు సమాచారం.
ఈనెల 10 మోడీ తెలంగాణకు రానున్నారు.ఈ క్రమంలోనే భారీగా జనాలను ప్రధాని సభకు తరలించేందుకు కాషాయ శ్రేణులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర నాయకత్వం మోడీ సభకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. ఆయన రాకకోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేయిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని అడిగే వారికి ఈ సభా వేదికగా ప్రధాని మోడీ బలమైన సమాధానం ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రధాని.. స్థానిక ఎంపీలకు గతంలో క్లాస్ పీకారు.దాని పురోగతి ఏమేరకు ఉందో ఈ పర్యటనలో ఆయన ఆరా తీస్తారని తెలుస్తోంది.
ఇదిలాఉండగా, తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని.. సీతకన్ను చూపిస్తున్నదని, కేంద్రమంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్రమంత్రులు ఉంటే ఎందుకు నిధులు, కేంద్ర ప్రాజెక్టులు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రధాని మోడీని తీసుకుని రావడం, హిందీలో నాలుగు మాటలు మాట్లాడించడం, తిరిగి పంపించడం వలన లాభం ఏంటని ఆమె ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు మహిళా మంత్రికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారని.. సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.
నువ్వు మొగోడివైతే చర్చకు రా.. బండి సంజయ్కి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. జై శ్రీరామ్ అంటే పైసలు రావు కానీ జై సోనియా, జై ఇందిరా అంటే పైసలు రాలుతాయా? అని కౌంటర్ ఇచ్చారు.సోనియా అంటే ఇటలి నుంచి వచ్చిన బొమ్మ అని.. ఇందిరా పేరు చెబితే దేశంలో విధించిన ఎమర్జెన్సీనే గుర్తుకు వస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. తామంతా హిందూ ధర్మం వారసులం అని జైశ్రీరామ్ అంటే కాంగ్రెస్ వాళ్లకు వచ్చిన నొప్పి ఏంటని ప్రశ్నించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమీ ఇచ్చారో ప్రభుత్వం ఉన్న మీకు తెల్వదా? అని పరోక్షంగా విమర్శలు చేశారు. ఎన్నికలు రాకముందే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తీరా ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అని చర్చ జరుగుతున్నది. అసలే వరుస విజయాలతో జోరుమీదున్న బీజేపీ.. రాష్ట్రంలో నిజంగానే అధికారంలోకి వస్తుందా? వారి ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలనిస్తాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే అని అంటున్నారు.