Congress vs BRS: తెలంగాణ మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది ఎన్నికల సంఘం. దీంతో తెలంగాణలో ఐదు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటినీ అధికార పార్టీ దక్కించుకుంటుందా? కారుకి ఏమైనా ఛాన్స్ ఇస్తుందా? ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఎత్తులకు కేసీఆర్ చిత్తవుతారా? పొలిటికల్ సర్కిల్స్లో దీనిపై చర్చ జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. దీనికి కావల్సిన సంఖ్యా బలం బీజేపీ వద్ద లేదు. దీంతో అధికార కాంగ్రెస్ -బీఆర్ఎస్ మధ్య పోటీ షురూ అయ్యింది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు తెలిసిన వారి ద్వారా లాబీయింగ్ చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
తెలంగాణలో ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మల్లేశం గతేడాది అధికార పార్టీలో చేరిపోయారు. ఇక రియాజుల్ హాసన్ మజ్లిస్ నేత. మిగిలిన వారంతా బీఆర్ఎస్కి చెందిన నేతలే ఉన్నారు.
ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. అధిక సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోనుంది. ఒక్క స్థానం ప్రతిపక్ష బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తమ స్థానాన్ని తమకే ఇవ్వాలని మజ్లిస్ పట్టుబడితే ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార పార్టీ నుంచి పలువురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ALSO READ: లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
రెడ్డి సామాజికవర్గం నుంచి జీవన్రెడ్డి, జగ్గారెడ్డి, సామ రామ్మోహన్రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కమ్మ సామాజికవర్గం నుంచి కుసుమ కుమార్, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి సునీతారావు పేరు ఉన్నాయి. బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ, చరణ్ కౌశిక్ యాదవ్, అంజన్కుమార్ యాదవ్, వజ్రేష్ యాదవ్ పేర్లు బయటకు వచ్చాయి.
మైనారిటీ నుండి ఫహిం ఖురేషి, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజికవర్గం నుంచి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజికవర్గం నుంచి బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉన్నారు. అంతా అనుకూలిస్తే కేవలం మూడు లేదా నాలుగు వర్గాల ఒకొక్కరి పేరు మాత్రమే ఫైనల్ కానుంది.
ఇక బీఆర్ఎస్ విషయానికొద్దాం. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. వారితో కలుపుకుని బీఆర్ఎస్ సంఖ్య 38 మందికి చేరుకోనుంది. పార్టీని వీడిన వారంతా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడం ఖాయం. ఎందుకంటే మారిన పది మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కారు పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ క్రమంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికే పరిమితం కానుంది.
అలాకాకుండా రెండో స్థానానికి మరొక అభ్యర్థిని రంగంలోకి దించుకుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో కేసీఆర్ వ్యవహారశైలి ఎలా ఉండబోతోంది? ఒకవేళ ఒక్క సీటు ఎవరికి ఇవ్వనున్నారు? బీసీలకు ప్రయార్టీ ఇస్తారా? సత్యవతి రాథోడ్కు మళ్లీ ఛాన్స్ ఇస్తారా? కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికి ఎరుక.