KCR: రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అందులోనూ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి అనుకుంటే ఏదైనా చేయగలరు. పక్కరాష్ట్రం నుంచి బీఆర్ఎస్లో చేరిన వ్యక్తికి.. తెలంగాణ ప్రభుత్వం తరఫున భారీ జీతం ఇవ్వటం గులాబీ బాస్కే సాధ్యమైంది. అట్లుంటది కేసీఆర్తోని.
శరద్ మర్కడ్ బాబాసాహెబ్. మహారాష్ట్రకు చెందిన యువకుడు. షేట్కారీ సంఘటన్కు చెందిన లీడర్. ఏప్రిల్ 2న గులాబీ కండువ కప్పుకున్నాడు. కేసీఆర్తో కలిసి ఫోటోలు కూడా దిగారు. పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని కమిట్ అయ్యాడు. అయితే, కేసీఆర్ మీద అభిమానంతోనో, బీఆర్ఎస్ మీద నమ్మకంతోనో శరద్ మర్కడ్ పార్టీలో చేరాడని అనుకున్నారంతా. కానీ, అతని చేరిక వెనుక జరిగిన దందా ఏంటో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బయటపెట్టాక కానీ తెలీలేదు అసలు సంగతి. మేటర్ తెలిసి అంతా ఔరా.. అంటూ అవాక్కవుతున్నారు.
శరద్ మర్కడ్ను సీఎం కేసీఆర్కు ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. ఉత్తినే కాదు.. నెలకు లక్షన్నర జీతం. ఆ జీతం కూడా ఇచ్చేది పార్టీ ఫండ్ నుంచి కాదు. ప్రభుత్వ ఖజానా నుంచే. ఏప్రిల్ 2న అతను బీఆర్ఎస్లో చేరితే.. మే 2న శరద్ను ప్రైవేట్ సెక్రటరీగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పూణె యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన శరద్కు ఓ ఐటీ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చినా దాన్ని వద్దనుకొని మరీ.. బీఆర్ఎస్లో చేరాడు. అది ఇందుకేనని ఇప్పుడు తెలుస్తోంది. ఐటీ కంపెనీ లక్ష సాలరీ ఆఫర్ చేస్తే.. కేసీఆర్ మాత్రం లక్షన్నర జీతమిచ్చి మరీ ఆయన్ను ప్రైవేట్ సెక్రటరీ పేరుతో పార్టీలో చేర్చుకోవడం వివాదాస్పదమవుతోంది.
తెలంగాణలో నిరుద్యోగుల్ని వదిలేసి పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఉద్యోగం ఇస్తారా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి గట్టిగానే ప్రశ్నించారు. బీఆర్ఎస్లో మహారాష్ట్ర నేతల చేరికలు అన్నీ చిల్లర వేషాలేనని విమర్శించారు. శరద్ మర్కడ్ను పీఎస్గా నియమిస్తూ జారీ చేసిన జీవోను బయటపెట్టారు. వెంటనే ఆ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సొమ్మును మహారాష్ట్రకి చెందినవారికి ఎలా ఇస్తారని నిలదీశారు రేవంత్రెడ్డి.