CP Sajjanar: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక చర్యలు చేపట్టారు. నగరంలో ఆధిపత్య పోరు సృష్టిస్తూ అశాంతి రేపుతున్న 10 క్రిమినల్ గ్యాంగులకు చెందిన 86 మంది సభ్యులపై భారీ బైండోవర్ చర్యలు తీసుకున్నారు. నగరంలో గ్యాంగ్ వార్ కార్యకలాపాలు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తామని, శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
సీపీ సజ్జనార్ తన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదా వినియోగించి కేసులను స్వయంగా విచారించారు. ఈ ప్రత్యేక విచారణ కోసం టీజీ ఐసీసీసీ (Telangana Integrated Command & Control Centre)లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో అశాంతికి కారణమవుతున్న గ్యాంగ్ సభ్యులపైనే అధికారులు దృష్టి సారించారు.
బైండోవర్ చేసిన గ్యాంగ్ సభ్యులందరితో బీఎన్ఎస్ సెక్షన్ 126 (BNS Section 126) కింద బాండ్ సంతకం చేయించారు. ఈ సెక్షన్ ప్రకారం, వారు ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండాల్సి ఉంటుంది. మళ్లీ ఎటువంటి నేరాలకు పాల్పడబోమని సభ్యులందరి నుంచి రాతపూర్వక హామీ స్వీకరించారు.
బాండ్ కాలంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అటువంటి సందర్భాలలో బాండ్ రద్దు చేస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ముఠా తగాదాలు, నేర కార్యకలాపాలు అరికట్టడం ద్వారా నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ALSO READ: Vijaysai Reddy: శ్రీకాకుళం నుంచి.. విజయసాయి రెడ్డి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ?